* ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల అక్రమ తరలింపు
* బిఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు
* భారీ వడ్డీలతో బిఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు
* పలు అంశాలపై ప్రజాప్రతినిధులకు వివరిచనున్న తెలంగాణ ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాలు అక్రమంగా తరలింపుతో పాటు బిఆర్ఎస్ పాలనలో తుమ్మడిహాట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై ఈ నెల 9 బుధవారం డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు అతిథిలుగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తుమ్మడిహాట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన దురదృష్టకరమైన పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించి ఆ ప్రాజెక్టు మార్పుపై ఎన్డిఎస్ఏ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణాలలో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ప్రాజెక్టును మార్చడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం భారీ వడ్డీలతో చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారిన అంశాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించనున్నారు. 2014 నుండి 2023 సాగిన బిఆర్ఎస్ పాలనలో ఆంద్రప్రదేశ్ కు కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపు ఎలా జరిగిందనే అంశంపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాజ్యసభ, లోకసభ, శాసనమండలి, శాసనసభ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్లు, కార్పొరేషన్ చైర్మన్లకు, నీటిపారుదల రంగ నిపుణులకు, అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేసినట్లు ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి.