మన తెలంగాణ/మోత్కూర్: భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొగుళ్ళ శేఖర్ రెడ్డి తెలిపారు. ముట్టడి కార్యక్రమ వాల్ పోస్టర్లను మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మొగుళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదన్నారు. భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు. “మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు. ‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని శేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామని, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువజన సంఘ శ్రేణులు పాల్గొంటారని శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, ఎఐవైఎఫ్ మండలాధ్యక్షులు చిప్పలపల్లి ప్రశాంత్ , సిపిఐ మండల సహాయ కార్యదర్శి పులకరం మల్లేష్ తాడూరు లక్ష్మీ నరసయ్య, గొలుసుల యాదగిరి, బత్తిని శ్రీనివాస్, సాసారగండ్ల వెంకన్న , దాసోజు బిక్షమాచారి, సారగండ్ల శివ తదితరులు పాల్గొన్నారు.