ఒక రంగంలో లబ్ధప్రతిష్ఠ్ఠుడైనంత మాత్రాన సదరు వ్యక్తి అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణించగలడని చెప్పలేం. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అల్లర్లకు, రాజకీయ అస్థిరత్వానికి మారుపేరుగా నిలిచిన బంగ్లాదేశ్లో పుట్టిపెరిగిన యూనస్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా సూక్ష్మరుణాలను అందజేసి లక్షలాది ప్రజలను పేదరికంనుంచి బయటపడవేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన కృషికి గాను సుమారు పాతికేళ్ల కిందట నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. అయితేనేం, గత ఏడాది రిజర్వేషన్ల గలభా కారణంగా ప్రధాని షేక్ హసీనా పదవి పోగొట్టుకుని, భారత్కు పరారై వచ్చిన తర్వాత ప్రభుత్వ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టిన యూనస్, గత తొమ్మిది నెలలుగా పాలనను పట్టాలెక్కించలేక పడరాని పాట్లు పడుతున్నారు.
మైక్రోఫైనాన్స్ బ్యాంకర్గా, ప్రొఫెసర్గా పేరొందిన ఈ పెద్దాయనకు పాలనానుభవం నాస్తి. రాజకీయానుభవం శూన్యం. ఫలితంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇంటాబయటా వివాదాలకు కారణమవుతున్నాయి. అవామీలీగ్ అధినేత షేక్ హసీనాతో ఆయనకు గతంనుంచీ విభేదాలు ఉన్నాయి. నోబెల్ సంస్థ యూనస్కు శాంతి బహుమతి ఇచ్చినా, పేదలను రుణాల ఊబిలోకి నెట్టివేశారంటూ ఆయనను హసీనా బహిరంగంగానే విమర్శించేవారు. దీనికితోడు కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ ఏణ్ణర్థం కిందట బంగ్లాదేశ్ కోర్టు యూనస్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాకతాళీయంగా ఆ సమయంలో అధికారంలో ఉన్నది షేక్ హసీనాయే కావడం ఇద్దరికీ మరింత దూరం పెరిగేందుకు దోహదపడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో యూనస్ ముందుగా హసీనాపైనా, ఆమె పార్టీపైనా గురిపెట్టారు. హసీనా ప్రధాన అనుచరులను అరెస్ట్ చేయించడంతో శాంతించకుండా ఏకంగా ఆమె పార్టీనే నిషేధించారు. పాకిస్తాన్లో బెంగాలీల స్వయం ప్రతిపత్తికోసం పోరాటం సల్పి, స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన, ఏడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన అవామీలీగ్పై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద వేటు వేయడం సహజంగానే లక్షలాది పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. పార్లమెంటు అనుమతి లేకుండా ఒక రాజకీయ పార్టీని ఎలా నిషేధిస్తారంటూ హసీనా ప్రశ్నించడంలో అర్థం లేకపోలేదు. మరోవైపు ఆమెకు ఆశ్రయం ఇచ్చిందన్న అక్కసుతో భారత్తో కోరి కయ్యానికి కాలు దువ్వుతున్నారు.స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారత్ పోషించిన పాత్ర ఎటువంటిదో ఆ దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ యూనస్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు.
భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు తామే దిక్కనే విధంగా చైనా గడ్డపైనుంచి ఆయన చేసిన ప్రకటన ఇరుదేశాల స్నేహ సంబంధాలను దెబ్బతీసింది. అంతటితో ఊరుకోకుండా ఇటీవల టగ్ బోట్ల నిర్మాణానికి భారత ప్రభుత్వ రంగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ నుంచి పలు దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలహీనపడ్డాయి. తాను తాత్కాలిక సారథినేనన్న విషయానికి విస్మరించి, నియంత పోకడలు పోతున్న యూనస్ వైఖరిపై బంగ్లాదేశ్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించి, ప్రజాప్రభుత్వానికి పాలనా పగ్గాలు అప్పగించవలసిన యూనస్, ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆ దేశ సైన్యాధ్యక్షుడు సైతం బహిరంగంగానే నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే, అవసరమైతే వీధిపోరాటాలకైనా సిద్ధమే తప్ప, ముందుగా ఎన్నికల నిర్వహణ వీలు కాదని యూనస్ మొండికేస్తున్నారు.వచ్చే ఏడాది ఆగస్టులోగాని ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వానికి సహకరించని అధికార యంత్రాంగం, సద్దుమణగని అల్లర్లు, పట్టాలెక్కని పాలన… యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని వధ్యశిలపై నిలబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల పుకార్లు గుప్పుమనడంలో ఆశ్చర్యమేముంది? ఇవన్నీ నిజం కాదంటూ ప్రభుత్వం కొట్టిపారేసినా, ఎన్నికలు జరిగేంతవరకూ యూనస్ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ప్రపంచమంతా మెచ్చిన వ్యక్తికి అధికారం చేపట్టాక ఏమైంది? ఈ ప్రశ్న ఇప్పుడు బంగ్లాదేశ్లోని ప్రతి పౌరుడినీ వేధిస్తోంది. ఈ విషయంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది.