పూరి: ఒడిశాలోని పూరిలో జరిగిన వార్షిక రథయాత్ర ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ రథయాత్ర ఉత్సవం సందర్భంగా 500 మందికి పైగా భక్తులు గాయపడగా, పలవురి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలో జగన్నాథ రథాన్ని లాగడానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ రథయాత్ర సందర్భంగా కొంతమంది స్పృహ కోల్పోయినట్లు వచ్చిన వార్తలపై ఒడిశా మంత్రి ముఖేష్ మహాలింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “అధిక తేమ కారణంగా, ఒకరు లేదా ఇద్దరు భక్తులు కుప్పకూలిపోయారు. రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. గాయపడిన వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించా. ఆసుపత్రిని కూడా సందర్శిస్తాను” అని పేర్కొన్నారు.
కాగా, 12వ శతాబ్దపు పుణ్యక్షేత్రం దగ్గర నుండి శ్రీ గుండిచా ఆలయం వైపు వెళ్లే రహదారిపై వేలాది మంది జగన్నాథుడు, అతని తోబుట్టువుల రథాలను తాళ్లతో లాగారు. శుక్రవారం రథయాత్ర ఉత్సవం ప్రధాన భాగం ప్రారంభమైంది. ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, పలువురు ప్రముఖులు జగన్నాథుడు, దేవి సుభద్ర, బలభద్ర స్వామి రథాన్ని లాగిన వారిలో ఉన్నారు.