భారత ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు ‘భారతరత్న’ ప్రకటించడం హర్షదాయకం. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పివికి పేరుంది. పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పివి నరసింహారావు జన్మించారు. పివి ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు. 1938 లో నిజాం వ్యతిరేక పోరాటంలో పివి పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ట్రంలో ఎక్కడా చదవకుండా ప్రభుత్వం నిర్బంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ట్రలోని పుణెలో బిఎస్సి, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పూర్తి చేశారు.
హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన పివి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పివి స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఎల్ఎగా గెలుపొందారు. అలాగే 1962, 67, 72 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లోనూ శాసన సభ్యుడిగా విజయం సాధించారు. 1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి పనిచేసిన సమయంలో భూసంస్కరణ చట్టం తీసుకొచ్చి వందలాది ఎకరాలను కలిగి ఉన్న భూస్వాముల నుంచి భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారు.
భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్కచేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి. పివి స్వతహాగా భూస్వాముల కుటుంబానికి చెందిన తన వద్ద ఉన్న 1200 ఎకరాల భూమిని వదులుకున్న ధైర్యశాలి. పివి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పెత్తందార్లు అడవులో వన్యమృగాలను చంపడంతో చలించిపోయి, వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. 1972లో భూ సంస్కరణలపై రాష్ట్ర అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చించింది. జూన్ వరకు జరిగిన చర్చలను ప్రథమ సంపుటిలో ప్రచురించారు. (శాసన సభలో ప్రముఖుల ప్రసంగాలు 2) 1972 ఆగస్టు, సెప్టెంబర్లలో నాటి నూతన సామాజిక పరిణామాలతో అర్ధవంతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1972లో ఎన్నికలు జరిగాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలు, హరిజనులు, మహిళలకు మొత్తం సీట్లలో 60 శాతం కేటాయించడంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులకు టికెట్లు లభించలేదు. ఆ ఎన్నికల్లో మజ్లిస్తో కలిపి ఇండిపెండెంట్లు 56 స్థానాలు గెలుచుకున్నారు. కాంగ్రెస్కు 213 స్థానాలు లభించగా, స్వతంత్ర పార్టీ 2, సిపిఐ 7, సిపిఎం 1, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 2 స్థానాలు గెలుపొందారు. ఎన్నికల అనంతరం పివి నరసింహారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో 1973 జనవరి 18న పివి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
పివి సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావించిన ఇందిరా గాంధీ ఆయనను 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన ఈ పనిలో 1975 దాకా కొనసాగారు. ఇందిరా గాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉంటూ, ఎమర్జెన్సీ తర్వాత దేశమంతటా కాంగ్రెస్ ఓడిపోయినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు. నాడు రాష్ట్రంలో 42 స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్కు రావడం వెనుక పివి పాత్ర కీలకం. ఇందిర హయాంలో తన బహుముఖ ప్రతిభా సామర్ధాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పివి అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక భూమిక పోషించారు. పివి లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ, నంద్యాల, మహారాష్ట్రలోని రాంటెక్, ఒడిశాలోని బరంపూర్ నియోజకవర్గాలలో విజయాలు సాధించి 6, 7, 8, 9, 10, 11 లోక్సభలలో ప్రాతినిధ్యం వహించారు.
1977, 80 ఎన్నికల్లో హన్మకొండ నుండి విజయం సాధించిన పివి 1984 ఎన్నికల్లో టిడిపి మిత్రపక్షం బిజెపి అభ్యర్థి జంగారెడ్డి చేతిలో 54 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఆ ఎన్నికల్లో రాంటెక్ నుంచి విజయం సాధించిన పివి 1989లో కూడా రాంటెక్ నుండి విజయం సాధించారు. రాజీవ్ గాంధీ మంత్రవర్గంలో మానవ వనరులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యంలో శరీరం సహకరించక రాజకీయాల నుండి విరమించుకుని పివి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజీవ్ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రధానిగా పివి పేరును కాంగ్రెస్ పార్టీలోని అందరూ ప్రతిపాదించారు. పివినే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధాని పగ్గాలు అప్పగించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరుమాసాల్లోపు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా సమర్థంగా వ్యవహరించారు.
అదే సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడమే కాక భారత ప్రగతి ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాయి. నమ్ముకున్న పార్టీ నుంచి 1997 తర్వాత అనేక అవమానాలు పివికి ఎదురయ్యాయి. జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఆ సచ్ఛీలుడి ముందు ఏ కేసు నిలవలేదు. 1996లో కూడా గెలుపొందిన పివి 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేయలేదు. పివి సాధించిన విజయాలలో మచ్చుకు కొన్ని. పివిపై గౌరవంతో నాడు ప్రధాని ఇందిరా గాంధీ ఏకంగా ఆయన కోసమే కేంద్ర మానవ వనరుల శాఖను ఏర్పాటు చేశారు. తనకిచ్చిన గౌరవాన్ని పివి ప్రజల కోసం వినియోగించారు. దేశంలో అణుపరీక్షలు మొదలు పెట్టింది పివి సర్కారే. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పివి సొంతం. పివి ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక మలుపులు చోటు చేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించారు. సంస్కరణలకు బీజం వేశారు. అందుకే పివిని దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తుంటారు. దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు వాడిగా చరిత్ర కెక్కిన పివి మరణం ఇటు రాష్ట్ర, అటు కేంద్ర పెద్దలను కదిలించలేదు. 2004 డిసెంబర్ 23న పివి మరణించారు. ఆయన అంత్యక్రియలకు ప్రాధాన్యమివ్వడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇది సగటు తెలుగువాడిని కలచివేసింది.
కొలనుపాక కుమారస్వామి
9963720669