సింగపూర్లో జరిగిన ‘షాంగ్రిలా డైలాగ్’ సమావేశంలో పాల్గొన్న భారత రక్షణ సిబ్బంది ప్రధానాధికారి (సిడిఎస్) అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ‘ఎన్ని యుద్ధ విమానాలు నేలకూలాయి అన్నది ముఖ్యమైనది కాదు. అవి, ఎలా కూలాయి అనేదే ముఖ్యమైంది’ అని ఆయన చెప్పడం.. ‘మనం మొదటి రోజున చేసిన వ్యూహపరమైన తప్పిదాలను 48 గంటల్లో సరిదిద్దుకుని పాకిస్తాన్పై దాడులకు సిద్ధమైనామని’ వెల్లడించారు. అలాగే ‘మన యుద్ధ విమానాలను పాకిస్తాన్ నేలకూల్చి భారత్కు నష్టం చేశాయని నిజాలను కొత్తగా చెప్పినట్లైంది. అయితే అనిల్ చౌహాన్ చెప్పినట్లు కొన్ని రాఫెల్స్ యుద్ధవిమానాలను కోల్పోయాం (ఎన్ని విమానాలు అనేది నిర్ధారణగా చెప్పలేదు). కానీ, పాకిస్తాన్ ప్రధాని చెప్పినట్లు 6 విమానాలు కాదు అని మాత్రమే అని చెప్పారు.
అయితే, ఇప్పటివరకు అధికారికంగా రాఫెల్స్ యుద్ధ విమానాలు(Rafale fighter jets) ఏవీ కూలలేదని ప్రచారం చేసిన అధికార పార్టీ మద్దతుదారుల వాదనలను అసత్యం అని నిర్ధారణ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని చెప్పిన ఆరు విమానాలు కూల్చాం అన్న వాదనను కూడా ఆయన తప్పు అని కొట్టిపారేశారు. ఏదిఏమైనా సిడిఎస్ చెబుతున్నట్లు మనకు కొంత నష్టం జరిగిందన్నది స్పష్టం. (యుద్ధం అన్నాక ఇరుపక్షాలకు కొంత మేరకు నష్టం జరగడం సర్వసాధారణ విషయమే. ఇందులో వింత ఏమీలేదు.) కాకపోతే అధికారికంగా నష్టం జరగలేదని చెప్పటమే ఇప్పుడు ఇబ్బంది. మరోవైపు, చైనాతో పాకిస్తాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ ఘర్షణలో చైనానుంచి ప్రత్యక్షంగా సహాయం అందలేదని సిడిఎస్ చెప్పడం గమనార్హం.
అయితే పాకిస్తాన్ చైనానుంచి కొనుగోలు చేసిన రాడార్లు మన దేశ భూభాగంలోనే మన విమానాలను కూల్చాయని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 2019 బాలాకోట్ దాడి తరహాలో మన వైమానిక నష్టం జరిగి ఉండవచ్చన్న సూచనలు కూడా బయటపడ్డాయి. ఇదే సమయంలో, సిడిఎస్ మాట్లాడుతూ ‘చైనా ఆయుధాలు పని చేయలేదు’ అన్న ఆయన వ్యాఖ్యలు చైనా తయారీ ఆయుధాల నాణ్యతా లోపాలు వెల్లడించాయి. అయితే ఈ రాద్ధాంతం అంతా విదేశీ వేదికపై జరగడం పట్ల మన దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణ వ్యూహకర్త బ్రహ్మ చెలానే మాట్లాడుతూ ‘ఇలాంటి కీలక విషయాలు మన దేశ వేదికపైనే వెల్లడించాలి కానీ శత్రు దేశ ప్రతినిధి ఉన్న షాంగ్రిలా సమావేశంలో చెప్పడం ద్వారా పాకిస్తాన్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని మండిపడ్డారు. అంతేకాక, మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వర్గాలు, ఇలా విదేశీ వేదికలపై మాట్లాడటం భారత స్వాభిమానానికి తక్కువ చేసేదిగా అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ 1999 లో కార్గిల్ యుద్ధం అనంతరం వాజపేయి ప్రభుత్వం కె. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో సమీక్ష కమిటీ ఏర్పాటు చేసి పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
ఇప్పుడు కూడా అలాగే చేసే అవసరం ఉంది అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఇంత కీలక సంఘటనపై పార్లమెంట్ సమావేశంకూడా ఏర్పాటు చేయకపోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకున్న చిన్నచూపును తెలుపుతున్నది. మణిపూర్ సమస్యపై రెండు సంవత్సరాలుగా ప్రజల అనిశ్చితిని చూసి స్పందించని మోడీ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం రోడ్ షోలు చేస్తూ సైనిక విజయాల్ని తన పార్టీ విజయాల కోసం ప్రచారంగా వాడుకుంటున్నారని విమర్శలు పెద్ద ఎత్తున విపక్షాలనుండి వస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, బ్లూమ్బర్గ్, రాయిటర్స్, గ్లోబల్ టైమ్స్ వంటి పత్రికలు కూడా సిడిఎస్ వ్యాఖ్యల్ని ప్రముఖంగా ప్రచురించాయి. గ్లోబల్ టైమ్స్ యుద్ధ విమానాల కూలిపోవటం గురించి అప్పటికే వార్తలు రాసినప్పుడు ఆ వార్తలను మన విదేశాంగ శాఖ దురదృష్టకరమైన, నిర్ధారణలు చేసుకోకుండా రాస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చెసింది. ఇప్పుడు సిడిఎస్ స్వయంగా అదే విషయాలు చెప్పినందువల్ల గతంలో భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పిన అభ్యంతరానికి విలువ లేకుండాపోయింది.
ఈ నేపథ్యంలో విమానాలు(Rafale fighter jets) మన దేశంలో కూలాయా లేక పాకిస్తాన్ భూభాగంలోనా అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మన పైలట్లు సురక్షితంగా తిరిగి వచ్చారు అంటే, విమానాలు మన నేలపైనే కూలిపోయినవని అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్కు కీలక విజయం కావచ్చు. ఇక అమెరికా తయారీ ఆయుధాల గురించి సిడిఎస్ వ్యాఖ్యలు చూస్తే పాకిస్తాన్కు అమెరికా ఇచ్చిన ఆయుధాలతో దాడులు చేసివుండవచ్చని, ట్రంప్ పరిపాలనలో వాటి వినియోగంపై నియంత్రణలు సడలించబడ్డాయన్న వాదనలు కూడా బలపడుతున్నాయి.
ఇలా చూస్తే శత్రు దేశంపై విజయం అంటూ బిజెపి ప్రచారం చేస్తున్నా, ఆ యుద్ధ విజయాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకురాకుండా, పార్లమెంట్కు దూరంగా ఉంచాలన్న మోడీ ప్రభుత్వ వ్యూహం వెనుక చీకటి వాస్తవాలు దాగి ఉన్నాయని అనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలంటే పార్లమెంట్లో చర్చ జరిపి సైనికుల ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాదు, ప్రజల ముందు నిజాలను ఉంచడమూ అవసరం. ఈ నేపథ్యంతో ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించడం వాంఛనీయం. కానీ ప్రధాని మోడీకి పార్లమెంటులో విపక్షాలను, బయట మీడియాను ఎదుర్కొనే ధైర్యం చేయరు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది.
డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496