న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. మంగళవారం కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీలు తమ వాదనలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఆపరేషన్ సిందూర్పై ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. లోక్సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. భారత్ పాక్ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోడీ తిరిగి ఎందుకు ప్రశ్నించలేదు ?ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోడీ చూపించలేదు. మరి ట్రంప్తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్మునీర్ల లంచ్ విషయాన్ని మోడీ ఎందుకు ఖండించలేదు. ? జైశంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆపరేషన్ సిందూర్కు విపక్షాల మద్దతుపై గర్విస్తున్నా
పహల్గాం ఉగ్రదాడి అమానుషమని, ఈ దాడి తరువాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి
మద్దతు తెలిపాయని, ఇందుకు తాము గర్విస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు,వృద్ధులు చనిపోయారని, భార్య కళ్లముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలుగా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా నిలిచామని, ఆపరేషన్ సిందూర్కు ముక్తకంఠంతో మద్దతు తెలిపామని చెప్పారు.
‘మీకూ, సాయుధ బలగాలకూ అండగా నిలుస్తామని ప్రభుత్వానికి మేము చెప్పాం. ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇదే మాట చెప్పాం. మేమంతా ఈ విషయంలో గట్టిగా నిలబడ్డామని తెలియజేశాం. ’ అని రాహుల్ అన్నారు. పహల్గా ఉగ్రదాడి సంఘటన పాకిస్థాన్ పనేనని, పాక్ దుశ్చర్యను ప్రతిఒక్కరూ ఖండించారని రాహుల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలిచారని అన్నారు. పహల్గాం దాడి బాధితులను తాము స్వయంగా కలిశామని చెప్పారు. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు రాజకీయ సంకల్పం ఉండాలని, 1971 యుద్ధంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని, అప్పటి జనరల్మాణిక్షాకు ఇందిరాగాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేశారు.
యుద్ధం చేసే సంకల్పం లేదు
యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ఈ ప్రభుత్వానికి లేదనే విషయం రక్షణ మంత్రి చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. ‘ మీరు దాడులు చేయొద్దని పాక్కు చెప్పడం దేనికి సంకేతం? పాక్కు భారత్ 30 నిమిషాల్లోనే లొంగిపోయింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయింది. అరగంటలోనే కాల్పుల విరమణను ప్రతిపాదించారు ’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.