ఆపరేషన్ సిందూర్, పాక్ – భారత్ మధ్య కాల్పుల విరమణపై ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు లొంగిపోయారని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. గతనెల పాకిస్తాన్ తో సైనిక ఘర్షణ సమయంలో , అంటే ఆపరేషన్ సిందూర్, భారత్ -పాక్ మధ్య నాలుగు రోజులపాటు క్షిపణులు, వైమానిక దాడుల సమయంలో అమెరికా ప్రెసిడెంట్ …నరేందర్ .. సరండర్ అనగానే మోదీ లొంగిపోయి.. కాల్పుల విరమణ ప్రకటించారని రాహుల్ విమర్శించారు. భోపాల్ లో ఒక కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ, ట్రంప్ నుంచి నరేందర్ జీ వెంటనే లొంగిపోవాలని పిలుపు వచ్చిందని, మోదీ లొంగిపోయారని, అన్నారు. చరిత్ర దీనికి సాక్ష్యం అనీ, ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్షణం అని విమర్శలు గుప్పించారు.
1971 లో పాక్ – భారత్ యుద్ధం సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులకు లొంగకుండా శతృదేశాన్ని విచ్ఛిన్నం చేశారని, అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా ధీమాగా నిలిచారని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎన్నడూ లొంగదు అని ఆయన పేర్కొన్నారు.కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్వరంతో స్పందించింది. రాహుల్ గాంధీ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి తుహీన్ సిన్హా విమర్శించారు.మే నెలలో భారత్ – పాక్ మధ్య అకస్మాత్ గా కాల్పులు నిలిపివేయడంలో తామే కీలక పాత్రవహించామని ట్రంప్ పదేపదే ప్రకటించారు. ట్రంప్ అలాంటి పాత్ర పోషించలేదని భారత దేశం గట్టిగా చెప్పినప్పటికీ, ట్రంప్ మాత్రం తమవల్లనే యుద్ధం అర్థాంతరంగా ఆగిందని అంటూ వచ్చారు. అమెరికా కోర్టులోనూ
ఇదే వాదన వినిపించారు.