ఆంగ్లంలో మాట్లాడడాన్ని భవిష్యత్లో సిగ్గుచేటుగా భావిస్తారని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షనేత రాహుల్ గాంధీ సహా పలువురు విరుచుకుపడ్డారు. ఇంగ్లీషు భాష ఆటంకం కాదని.. అదొక వంతెన, మన చేతిలో ఆయుధం లాంటిందని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి చిన్నారిని సమాన హక్కులు కల్పించిందేకు బిజెపి, ఆర్ఎస్ఎస్ బద్ధ వ్యతిరేకులని రాహుల్ మండిపడ్డారు. పేదల సాధికారతను ఒప్పుకోరని, అదే జరిగితే వాళ్లు ప్రశ్నిస్తారని వాళ్ల భయమని దుయ్యబట్టారు. అలాంటప్పుడు బిజెపి మంత్రులు, వాళ్ల పిల్లలు ఇంగ్లాండ్ వెళ్లి గొప్ప గొప్ప యూనివర్శిటీల్లో ఆంగ్లం నేర్చుకుని వస్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీషు అనేది ఒక ఆయుధం లాంటిందని, ఆ భాషను నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా అమెరికా, జపాన్ తదితర దేశాలకు వెళ్లి రాగలమన్నారు.
ప్రపంచంలో ఏ కంపెనీలోనైనా ఉపాధి పొందవచ్చునన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు ఇంగ్లీషు వద్దు హిందీ మాత్రమే నేర్చుకోవాలని గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా రాహుల్ విడుదల చేశారు. పేదలు ఆంగం నేర్చుకోవద్దనే పిలుపుల వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ‘వాళ్లు గొప్ప ఉద్యోగాలు చేయొద్దు, బోర్డు రూమ్ల్లోకి ప్రవేశించొద్దు, కోట్లాది రూపాయాలు సంపాదించొద్దు. దళితుల పిల్లలు దళిత హాస్టళ్లకే పరిమితం కావాలి. ఇలాంటి కుట్రలతో మీకు తలుపులు మూసేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఇంగ్లీషును అభ్యసించి దాన్ని ఆయుధంగా వాడుకోవాలి. అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆంగ్లంపై అమిత్ షా దుర్మార్గ పూరితంగా మాట్లాడారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. కోట్లాది మంది భారతీయులు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని, అది రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కు అన్నారు. సర్దార్ పటేల్ అభిప్రాయంతో అమిత్ షా విభేదిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.