దేశంలోకి ఇప్పుడు బలీయంగా మరోసారి సంఘ్ పరివార్ దండు దిగింది. వారి ముసుగు తొలిగింది. ఈ ఆర్ఎస్ఎస్ వారికి రాజ్యాంగం అవసరం లేదు. వారు కోరుకునేది మనుస్మృతి అని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సంచాలకులు దత్తాత్రేయ హొసబలే రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక పదాలను తొలిగించి వేయాలనే డిమాండ్ చేయడంపై రాహుల్ శుక్రవారం స్పందించారు. ఇంతకాలం వరకూ ఉన్న వారి ముసుగులు ఇప్పుడు తీసివేశారు. రాజ్యాంగం అంటే వారికి ఒళ్లు మంట. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కువగా సమానత, లౌకికత, న్యాయం ప్రస్తావనలు ఉంటాయి. ఇది వీరికి గిట్టదు. అందుకే రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తీసివేయాలనే నినాదం బలోపేతం అవుతోందని వ్యాఖ్యానించారు.
‘వారికి మనుస్మృతి అత్యవసరం. బడుగు అణగారిన వర్గాలు వారి హక్కుల హరణనే ఈ దండు పాళ్యం ఆలోచనా విధానం అన్నారు. రాజ్యాంగం నుంచి అత్యంత శక్తివంతపు ఆయుధం వంటి కీలక పదాల అపహరణ వీరి ప్రధాన లక్షం అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వారి నిజమైన అజెండా , వారి మను జెండా ఇప్పుడు తిరిగి రెపరెపలాడుతోందన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ పగటికలలు నిజం కాబోవని స్పష్టం చేశారు. వారి కుయుక్తులను తిప్పికొడుతామన్నారు. ప్రతి దేశభక్తియుత పౌరుడు , నిజమైన భారతీయుడు తమ తుది శ్వాసల వరకూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పీఠికలోని అంశాలను ప్రాణప్రదం చేసుకుంటారని ఈ ప్రతిపక్ష నేత తెలిపారు.