బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైల్ రోకో నిర్వహించిన తీరుతామని తేల్చిచెప్పారు. సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైల్ రోకో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బిసి సమాజం, తెలంగాణ జాగృతి, యుపిఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ, కౌన్సిల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని గుర్తు చేశారు.
ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రైల్ రోకో చేసి తీరుతామని తెలిపారు. రైల్ రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని వెల్లడించారు. బిసిల రిజర్వేషన్ల పెంపు, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జూలై 16, 17, 18 తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎంఎల్సి కవిత మరోసారి విజ్ఞప్తి చేశారు.
సింగరేణిలో సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
సింగరేణి కాలరీస్ సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎంఎల్సి కవిత డిమాండ్ చేశారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు సర్వేయర్ కోర్సు పూర్తి చేసి డిజిఎంఎస్ నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్థలో ఇంటర్నల్ సర్వేయర్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సర్వేయర్ కోర్సు పూర్తి చేసిన వారి కోసం నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.