ఉత్తర ప్రదేశ్కు చెందిన బాలకార్మికులను రైల్వే పోలీసులు రక్షించారు. ముస్కాన్ ఆపరేషన్లో భాగంగా గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్లో 8 మంది బాలలను చేరదీసి వారిని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యంగా ముస్కాన్ ఆపరేషన్ పనిచేస్తుందని ఈ సందర్భంగా కాచిగూడ రైల్వే ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు. బాలలను చేరదీసి వారి భవిష్యత్తు అంధకారం కాకుండా చూస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్కేష్ కుమార్, పప్పు ఖాన్, గులాం హుస్సేన్, అభిమన్యు సహాని, ఒక ముఠాగా ఏర్పడి యూపీ నుంచి బాలురను తెచ్చి హైదరాబాద్లో వివిధ పనుల్లో కుదుర్చుతున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో యుపికి చెందిన కృష్ణ పవన్(15), ఆకాశ్(15), విక్కీ (11), దీపక్ గౌతమ్(14), సాహిద్(16), లాజర్(14), ఉదయ్ ధాన్(15), అజయ్ (17) బాలురను గోరఖ్పూర్ యశ్వంత్పూర్ రైలులో కాచిగూడ రైల్వే స్టేషన్కు తెచ్చారని, అయితే బాలుర అక్రమ రవాణాను గుర్తించిన ముస్కాన్ ఆపరేషన్ ప్రతినిధులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలురను సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఆశ్రిత ఓపెన్ షెల్టర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. బాల కార్మికులతో పనిచేయించడానికి యూపీ నుంచి వారిని తీసుకొచ్చిన నలుగురిని కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.