రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా, మరో నాలుగు రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే ముందుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం, వచ్చిన రెండు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించడంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. విపరీతమైన ఎండలకు మారుపేరుగా ఉండే రోహిణి కార్తె కంటే ముందుగానే నైరుతు రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో రోహిణి కార్తె ఎండల నుంచి విముక్తి లభించిందని ప్రజలు భావించారు. దీనికి అనుగుణంగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రమంతా వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వర్షాకాలం ముందస్తుగానే వచ్చేసిందని సంతోషించే లోపే వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.
జూన్ నెలలో రెండు వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అంచనా వేసింది. మే నెలలో ఉండాల్సిన ఎండలు, జూన్ రెండవ వారంలో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో గత వారం రోజుల నుండి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఉదయం విపరీతమైన ఎండ, సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. శనివారం రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉండగా, మధ్నాహ్నం తరువాత పలు మండలాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో దట్టమైన వర్షం కురిసింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.