తెలంగాణలో రానున్న 4 రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ కేంద్రం(ఐఎండి) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారుతుందని.. మే 22న వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండి.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, మలక్పేట, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, ఎల్బి నగర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ రోడ్లపై నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలని.. ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే, మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని.. కాంటాలు వేసిన ధాన్యాన్నివెంటనే మిల్లులకు తరలించాలని సిఎం రేవంత్ ఆదేశించారు.