హైదరాబాద్: గోషామహల్ బిజెపి (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి సంబంధించిన నేతలపై ఆయన పలు ఆరోపణలు చేశారు. తనను అధిష్టానం సస్పెండ్ చేస్తే.. అందరి జాతకాలు బయటపెడతానని రాజాసింగ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసేందుకు కాస్త సమయం కేటాయించాలని.. వ్యక్తిగతంగా కలిసి కొన్ని విషయాలు చెప్తానని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయిస్తే.. అప్పుడు వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో బిజెపి (BJP) అధికారంలోకి రావాలంటే.. పాత సామాను పార్టీ నుంచి బయటకి వెళ్లిపోవాలని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రావాలంటే.. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కొందరు బిజెపి నేతలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లతో రహస్యంగా సమావేశం అవుతున్నారని ఆరోపించారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకొనే వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తే పార్టీకి మంచి రోజులు వస్తాయని తాను (Rajasingh) మాత్రమే కాదని.. ప్రతి బిజెపి నాయకుడు, కార్యకర్త కోరుకుంటున్నారని పేర్కొన్నారు.