5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’. (Ramayana) ఈ రెండు భాగాల చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజి సంయుక్తంగా, యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, ఐమ్యాక్స్ కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినీ ఈవెంట్ కి నాంది పలికేలా మేకర్స్ ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ పేరిట ఈ ఎపిక్ మూవీని గ్లోబల్గా ఆవిష్కరించారు.
ఇది పురాణాలలోని రెండు అత్యంత ప్రసిద్ధ శక్తులైన రాముడు వర్సెస్ రావణ మధ్య కాలాతీత యుద్ధానికి వేదికగా నిలిచింది. భారతీయ సినిమాలో నాలుగో తరం ఐకాన్ రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సూపర్స్టార్, సహ నిర్మాత యష్ రావణుడిగా, అందరి మనసులను గెలుచుకున్న అభిమాన నటి సాయి పల్లవి సీతగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, – లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. తొలిసారి ఆస్కార్ అవార్డు విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహ్మాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ, గైనోరిస్ గ్రాండ్గా యుద్ధ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఇది ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
ఈ గ్లింప్స్ను ప్రత్యేకంగా మీడియా కోసం హైదరాబాద్ ప్రసాద్ (PCX screen multiplex) మల్టీప్లెక్స్లోని పిసిఎక్స్ స్క్రీన్పై ప్రీమియర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ “ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణం ద్వారా మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లు కాదు – మేము మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రతిభను ఒకచోట కలిపి, ఈ కథను నిజమైన భావోద్వేగంతో, నూతనమైన సినిమాటిక్ టెక్నాలజీతో చెప్పగలగడం సాధ్యమవుతోంది.
ఇంతకుముందు రామాయణాన్ని ఎన్నోసార్లు చూశాం. – కానీ ఈ వర్షన్లో దాని దృశ్యాలు, యుద్ధాలు అన్నీ నిజమైన వైభవం, విస్తృతతతో అద్భుతంగా ఉంటాయి”అని అన్నారు. దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ “రామాయణం అనేది మనందరం చిన్ననాటి నుంచి ఎదిగి విన్న, చూసిన కథ. ఇది మన సంస్కృతికి ఆత్మవంటిది. ఆ ఆత్మను గౌరవించడమే మా లక్ష్యం. – అదే సమయంలో ఈ కథను అర్హమైన సినిమాటిక్ స్థాయిలో చూపించాలనుకున్నాం. ఒక దర్శకుడిగా, ఇది నా కోసం ఒక భారీ బాధ్యత మాత్రమే కాదు – ఓ గౌరవప్రదమైన అవకాశం”అని తెలిపారు.