ఇదే నెలలో లబ్ధిదారులకు
పంపిణీ కేంద్ర ప్రభుత్వ
సూచనల మేరకు అధికారుల
చర్యలు ఇప్పటికే
మొదలైన పంపిణీ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు నెలల రేషన్ సరుకులు ముందస్తుగానే అందనున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తు న్నారు. ఆదివారం నాడు రేషన్ షాపుల ద్వారా మూడు నెలల సన్నబియ్యం కోటాను పొందగలిగారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూన్ 1 నుంచి 30వ తేదీలోపు మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాదిలో అధికంగా గోధుమ దిగుబడి ఉన్నందున అక్కడి గౌడౌన్స్ అన్నీ పూర్తిస్థాయిలో నిండిపోయి ఉన్నాయి. వాటిని ఖాళీ చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఒకేసారి మూడునెలల సన్నబియ్యం సరఫరా చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఆరు లక్షల టన్నుల బియ్యం అవసరం
రాష్ట్రంలో దాదాపు 90లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డులు(రేషన్ కార్డులు) ఉన్నాయి. వీటి కింద 2.85 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. ఉచిత సన్నబియ్యం పథకం కింద రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్క లబ్దిదారుడికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో చొప్పున వాటా ఉంటుంది. ప్రస్తుతం నెలకు దాదాపు 1.9 లక్షల టన్నుల బియ్యం పంపిణీ అవుతుంది.
జూన్ ఒకటో తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు మూడు నెలలకు సరిపడే విధంగా సన్నబియ్యం ఇచ్చేందుకు సుమారు 6 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అవుతుంది. మేరకు మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు సన్న బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సరఫరాకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యం అందుతున్నది.
ఇకపై మూడు నెలలకు కలిపి జూన్ నెల నుంచి ఒక్కొక్క లబ్దిదారుడికి 18 కిలోల సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జూన్, జూలై, ఆగస్టు కోటా బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో 34,535 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్దం చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తు న్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూన్ 1 నుంచి 30వ తేదీలోపు పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో 619 రేషన్ దుకాణాల్లో జూన్ 1 నుంచి 30 వరకు రేషన్ దుకాణాలు తెరిచి బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కో దుకాణంలో 100 నుంచి 150 క్వింటాళ్ల బియ్యం నిల్వ చేసే సామర్థ్యం ఉందని, ప్రతి లబ్ధిదారుకు అందించే బాధ్యత తమదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 34,535 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 5,37,810 రేషన్ కార్డులు ఉండగా 18,65,353 మంది లబ్ధిదారులు ఉన్నారు.