ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బిఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ను ప్రకటించింది. 2024 25 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వానికి ఆర్బిఐ రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనుంది. ఇది గత సంవత్సరం ఇచ్చిన రూ.2.1 లక్షల కోట్ల కంటే 27.4 శాతం ఎక్కువగా ఉంది. అదే సమయంలో 2022 -23 సంవత్సరానికి ఆర్బిఐ డివిడెండ్ చెల్లింపు రూ.87,416 కోట్లుగా ఉంది. ఆర్బిఐ ప్రకటించిన డివిడెండ్ 2025 సంవత్సరం ఆర్థిక లోటును 4.4 శాతానికి తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడనుంది. ఈ డివిడెండ్ చెల్లింపుపై రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 616వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. గత వారం ఆర్బిఐ సెంట్రల్ బోర్డ్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ (ఇసిఎఫ్)ను సమీక్షించింది. బోర్డు ఇసిఎఫ్ను ఎజెండా కింద సమీక్షించిందని ఆర్బిఐ తెలిపింది.
డివిడెండ్ మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు?
డివిడెండ్ మొత్తాన్ని నిర్ణయించే ముందు, ఆర్బిఐ దాని మూలధన ఫ్రేమ్వర్క్ను సమీక్షిస్తుంది. దీనిని ఇసిఎఫ్ (ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్) అని పిలుస్తారు. ఇసిఎఫ్ అనేది ఒక రకమైన రిస్క్ మేనేజ్మెంట్ సాధనం, దీని కింద ఆర్బిఐ మార్కెట్ రిస్క్లు, క్రెడిట్ రిస్క్లు, ఆపరేషనల్ రిస్క్లను పరిగణనలోకి తీసుకుని కొంత మొత్తాన్ని రిజర్వ్లో తీసుకుంటుంది. దీని తర్వాత మిగిలి ఉన్న నిదుల మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేస్తారు.