రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో సహా పలువురు ప్రముఖులు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) యాజమాన్యం కూడా బాధితుల కుటుంబాలకు తనవంతు చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. తొక్కిసలాటలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆర్సిబి యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేగాక గాకుండా ఘటనలో గాయపడిన వారి చికిత్స కోసం ఆర్సిబి కేర్స్ పేరిట నిధులు సేకరించాలని యాజమాన్యం నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్సిబి ఒక ప్రకటనను విడుదల చేసింది. తొక్కిసలాట వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది చాలా విషాధకర ఘటన. ఇలాంటి సంఘటన జరుగుతుందని కలలో కూడా ఊహించలేక పోయాం. దుర్ఘటనలో పలువురు మృతి చెందడం తమను ఎంతో కలచి వేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాం. బాధిత కుటుంబాలకు ఆర్సిబి అండగా ఉంటుంది. మీడియాలో వచ్చిన కథనాలతో మాకు ఘటన గురించి తెలిసిందే. సంఘటన విషయం తెలియగానే తామంతా షాక్లోని వెళ్లిపోయాం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని తాము కోరుకుంటున్నామని ఆర్సిబి యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలిరావడంతో ఈ విషాధ ఘటన చేసుకుందన్నాడు. ఇది తనను ఎంతో మనోవేదనకు గురి చేసిందని పేర్కొన్నాడు.