రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం, ఆపై జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీం యాజమాన్యం విచారణను ఎదుర్కో బోతోంది. ఆర్సిబి మేనేజిమెంట్తో పాటుగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్( కెఎస్సిఎ) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు. ఆర్సిబి క్రికెటర్లకు సత్కార వేడుకను ప్లాన్ చేయడంలో వీరి పాత్రను ఇప్పుడు బెంగళూరు పోలీసులు, విచారణ కమిటీ సమీక్షిస్తోంది. ముఖ్యంగా తొక్కిసలాటకు కొద్ది గంటల ముందు ఆర్సిబి మేనేజిమెంట్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై విచారణ జరగనుంది. ఆర్సిబి క్రికెట్ టీమ్ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా దాదాపు 50 మంది గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఘటనకు కొద్ది గంటల ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( ఆర్సిబి) యాజమాన్యం
సోషల్ మీడియా‘ ఎక్స్’లో ఈవెంట్కు సంబంధించి అధికారికంగా ఒక పోస్టు పెట్టింది. బుధవారం( జూన్ 4వ తేదీ) మధ్యాహ్నం 3.14 గంటలకు ఆర్సిబి అఫిషియల్ ఎక్స్ హ్యాండిల్లో ఈ పోస్టు పెట్టింది.‘ విధానసౌధనుంచి చిన్నస్వామి స్టేడియంకు విక్టరీ పరేడ్ సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అందరూ రోడ్షోను శాంతియుతంగా ఆస్వాదించగలిగేలా పోలీసులు, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గ్దర్శకాలను పాటించాలని మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఉచిత పాసులు( పరిమిత ప్రవేశం) ‘shop rayal chalengers.comలో అందుబాటులో ఉన్నాయి’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు కారణంగానే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకోవడం వల్లనే తొక్కిసలాట జరిగిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.ఇప్పుడు దీనిపైనే ముఖ్యంగా దర్యాప్తు చేయనున్నారు.
నిర్వాహకుల లోపాలున్నాయి: బిసిసిఐ కార్యదర్శి సైకియా
ఇదిలా ఉండగా ఈవెంట్ నిర్వహణలో నిర్వాహకుల లోపాలు కొన్ని ఉన్నట్లు బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు. ‘పూర్తి వివరాలు తెలియకుండా ఇప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించలేను. కానీ ఇలాంటి భారీ ఈవెంట్లను నిర్వహించేటప్పుడు సరయిన ప్రణాళిక ఉండాలి. గత ఏడాది భారత్ వెస్టిండీస్లో టి20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు బిసిసిఐ ఎలా విజయోత్సవాన్ని నిర్వహించిందో ఉదాహరణగా తీసుకొండి. స్థానిక క్రికెట్ అసోసియేషన్ అంటే ముంబయి క్రికెట్ అసోసియేషన్తో పాటుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ముంబయి అధికారులు పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు.
ముంబయిలో అంత భారీ స్థాయిలో వేడుక నిర్వహించినప్పుడు జన సంద్రంలా అభిమానులు చేరినప్పటికీ ఒక్క చిన్నపాటి ఘటన కూడా జరక్కుండా సాఫీగా జరిగిపోయింది. ఎందుకంటే అన్ని ప్రోటోకాల్స్ను పాటించడం జరిగింది. అలాంటి ప్లానింగ్కు కొంత సమయం పడుతుంది. హడావుడిగా ఇలాంటి వాటిని నిర్వహించరాదు. బెంగళూరులో ఈ బాధ్యత కలిగిన అధికారులు కొంత ఆత్మవిమర్శ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎవరు ఎలాంటి తప్పు చేసినా కచ్చితంగా వదిలిపెట్టకూడదు’ అని సైకియా అన్నారు.