హిమాచల్ ప్రదేశ్కు ఆదివారం కుండపోత వానల రెడ్ అలర్ట్ వెలువరించారు. ఈ మేరకు సిమ్లా వాతావరణ పరిశోధనా కేంద్రం ఆదివారం ప్రకటన వెలువరించింది. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని, పల్లపు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదలు, కొండచరియల పతనం వంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో ఇప్పటికే సిమ్లా కల్కా రైల్వే మార్గంపై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
దీనితో ప్రయాణికులు చిక్కులు ఎదుర్కోవల్సి వచ్చింది. రైలు పట్టాలపై భారీ చెట్లు విరిగిపడటం, కొండరాళ్లు పడటంతో ముందు జాగ్రత్తగా రైళ్లను ఆపివేశారు. సిమ్లా నుంచి దేశంలోని దూర ప్రాంతాలకు దారితీసే సిమ్లా కల్కా జాతీయ రహదారి ఎన్ హెచ్ 5పై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు మూడు కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. హిమాచల్లోని 10 జిల్లాలకు భారీ వర్షాల రెడ్ అలర్ట్ జారీ అయింది. జాతీయ రహదారి వెంబడి ఉండే కోటి వద్ద భారీ స్థాయిలో వాహనాలు చాలా దూరం వరకూ నిలిచిపోయాయి.