రాష్ట్రంలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలుచేయనున్నది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించిన ఫైలును ఆర్ధిక శాఖ ఆమోదించింది. త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీకానున్నాయి. ఇకపై పదవీ విరమణ పొందే అంగన్ వాడి టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్కు లక్ష రూపాయల చొప్పున పదవీ విమరణ ప్రయోజనాలు అందనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 37,580 పైగా అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా, ప్రతి సెంటర్కు ఒక టీచర్, ఒక హెల్పర్ పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది సిబ్బంది అంగన్ వాడీ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సగటున ఏడువేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. అంగన్ వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు గా ఉంది. ఇప్పటి వరకు అంగన్ వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు యాబై వేల రూపాయలు మాత్రమే పదవీ విరమణ ప్రయోజనంగా లభిస్తోంది.