Wednesday, June 4, 2025

నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ

- Advertisement -
- Advertisement -

 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు రైతుల ఇంటి
వద్దకే అధికారుల బృందాలు పంద్రాగస్టులోగా అన్ని
భూసమస్యలకు పరిష్కారం : మంత్రి పొంగులేటి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం రెవెన్యూ వ్యవస్ధను దుర్వినియోగపరచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు.

మొదటిదశలో 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించామని ఆయన తెలిపారు. ఆ తర్వాత మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, తాజాగా ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో

అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్‌తో కూడిన బృందం వెళుతుందని, ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకున్నారని, సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉండేదని, ఏ సమస్యకైనా కోర్టు మెట్లు ఎక్కవలసిందేనని, కానీ, ఈనాడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వారి వద్దకే వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు 60 శాతం భూ సమస్యలకు పరిష్కారం

మొదటగా నాలుగు పైలట్ మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు, రెండో విడతలో 28 మండలాల్లో 421 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఇప్పటి వరకు 60 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించినట్టు ఆయన పేర్కొన్నారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని, ఈ విభాగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేయాలన్నారు.

నక్ష లేని 413 గ్రామాల్లో పునఃసర్వే

గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలు గ్రామ స్థాయిలో అందించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ముఖ్యంగా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ యంత్రాంగం మానవతా దృక్పథంతో వ్యవహారించి ప్రజలతో మమేకం కావాలని, వీలైనంత వరకు వారి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయన సూచించారు.

భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను (జిపిఓ) అతి త్వరలో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు, గ్రామ పాలన అధికారుల 10,954 పోస్టుల భర్తీకి జిఓ విడుదల చేయగా 5వేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మంచి అభ్యర్థులు హాజరు కాగా, తుది మెరిట్ జాబితాలో 3,550 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపును జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొనట్టు ఆయన తెలిపారు.

ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్ మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను రెండు నెలల్లో నియమించబోతున్నామని, తరతరాలుగా నక్ష లేని 413 గ్రామాల్లో పునఃసర్వే నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా టిజిఆర్‌ఏసి (- తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టామని, దీనికి సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News