న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ ఎంపి ప్రియా సరోజ్ ను భారత క్రికెటర్ రింకు సింగ్ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి. రింకు, ప్రియ వారణాసిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. నవంబర్ 18న వారణాసిలో వారిద్దరూ వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. జూన్ 8న లక్నోలోని సెవెన్ స్టార్ హోటల్లో రింకు, ప్రియ నిశ్చితార్థం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఆడిన తర్వాత రింకు తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
కాగా, గతంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని పుకార్లు కూడా వచ్చాయి. అయితే, ప్రియా తండ్రి నిశ్చితార్థ పుకార్లను ఖండించారు. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని, కానీ నిశ్చితార్థం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
ఐపిఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఈసారి ప్లేఆఫ్స్ కు చేరుకోకుండానే నిష్క్రమించింది.ఈ సీజన్ లో రింకు 13 మ్యాచ్ ల్లో 29.42 సగటు, 153.73 స్ట్రైక్ రేట్ తో 206 పరుగులు చేశాడు. నైట్ రైడర్స్ 14 మ్యాచ్ లలో ఐదు విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.