జిల్లా కేంద్రంలోని భూంనగర్ కాలనీలో రెండు అపార్ట్మెంట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు రెండు ఇళ్లను గుల్ల చేశారు. పట్టణంలోని 6వ వార్డు భూంనగర్కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయా ఇళ్ల యజనులు సందీప్, సదయ్యలో ఒకరు విదేశాలకు వెళ్లగా, మరొకరు తీర్థయాత్రలకు వెళ్లారు. ఆ రెండు ఇళ్లకు తాళాలు ఉన్నట్లుగా పసిగట్టిన దొంగలు సోమవారం అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి ప్రవేశించి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
అయితే, ఎంతమేరకు చోరీ జరిగిందన్న విషయం ఇంకా నిర్థారణ కాలేదు. చోరీ గురించి తెలుసుకున్న సిఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ మల్లేష్తోపాటు క్లూస్ టీం పోలీసుల బృందం సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనాలను నివారించడానికి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.