Tuesday, June 3, 2025

దృశ్యం రసాత్మకం కవిత్వం

- Advertisement -
- Advertisement -

రంగస్థలం

హైదరాబాద్ రంగభూమి వేదికపై మే నెల రెండవ వారంలో ఒకసారి, మూడవ వారంలో మరోసారి ‘కవిత్వమొక తీరని దాహం’ పేరిట ఒక ప్రదర్శన జరిగింది. ఇది కవిత్వంతో చేసిన కొత్త ప్రయోగం. దృశ్య మాధ్యమం ద్వారా కవిత్వ ప్రయోజనాన్ని సాధించాలన్న ప్రయత్నం. విజువల్ ట్రీట్‌తో ఒక వైబ్రేషన్‌ని వీక్షకులలోకి చొప్పించాలన్న గట్టి సంకల్పం. సుమా రు గంటన్నర నిడివి కలిగిన ఈ ప్రదర్శన తన ప్రయోగ ఫలితాన్ని సంతృప్తికర స్థాయిలోనే సాధించిందని చెప్పవచ్చు.
‘టీమ్ జె’ ప్రొడక్షన్ పేరిట సినీనటి ఝాన్సీ సమర్పించిన ఈ కార్యక్రమంలో ధన్య, ప్రేరణ, మనస్విని, రాగలీన, అనిరుథ్ ప్రదర్శకులుగా, బషీర్, రామ్మోహన్, కృష్ణప్రసాద్, హరీత్ రాఖీ, సిద్ బ్లూ రితీష్, రామలక్ష్మి సహాయకులుగా వ్యవహరించారు. కవితల కూర్పుకి తగ్గ సన్నివేశా ల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

చిన్న చిన్న పరికరాలు, వస్తువులను ఉపయోగించి గాఢమైన భావచిత్రాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించగలిగారు. శ్రీశ్రీ, శివసాగర్, సినారే, త్రిపురనేని శ్రీనివాస్, సావిత్రి, కలేకూరి ప్రసాద్, జయప్రభ, రజియా బేగం, సబికా అబ్బాస్ నక్వీ, రవీంద్రనాథ్ ఠాగూర్, రూమీ, మాయ ఆంజిలో, ఖలీల్ఖ జిబ్రాన్ సహా మరికొందరివి పాతిక కవితలను ఎంపిక చేసి, సంక్షిప్త వ్యాఖ్యానంతో వాటిని మాలగట్టి తమ తొలి, మలి ప్రదర్శనలతో సాహి త్య సౌరభాన్ని పంచిపెట్టారు. గురజాడ, కృష్ణశా స్త్రి, రాయప్రోలు, కాళోజీ, జాషువా, మహమ్మద్ ఇక్బాల్ వంటి ప్రసిద్ధుల కవితా చరణాల ప్రస్తావ న కూడా ఆయా సందర్భాలకి వన్నె తెచ్చింది. ఎంపిక చేసిన వాటిలో అధికం తెలుగు కవితలే అయినా అక్కడక్కడ హిందీ, ఇంగ్లీష్ కవితలకూ చోటు కల్పించడం ద్వారా త్రిభాషా సమ్మేళనంగా ప్రదర్శనని తీర్చిన విధం నప్పింది.

ఎంపిక చేసుకున్న కవితలను, వాటిలోని భా వాలను గమనిస్తే ఈ దండలోని దారం ఏ సందే శం ఇస్తుందో తేలికగా అర్ధమైపోతుంది. ‘అక్షరానికి పాలు తాపి పదం చేయాలి/పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి/వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి/కవిత్వానికి జీవితం ఇచ్చి ఆయుధం చేయాలి..’ అన్న శ్రీశ్రీ కవితా వాక్యాల తో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితతో ముగిసింది. శ్రీశ్రీ కవితలు నాలుగైదు తీసుకుని ప్రదర్శించినా దేనికదే వైవిధ్యాన్ని పొదువుకున్నాయి. ‘ఆః’ కవితని చిక్కని చక్కని దృశ్యచిత్రంగా మలిచి మెప్పించారు. కలేకూరి ప్రసాద్ ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ కవితని ప్రదర్శించినప్పుడు నేపథ్యం లో చుండూరు విషాద సన్నివేశాన్ని పటం కట్టించారు. అలాగే జయప్రభ ‘పైటని తగలెయ్యాలి’, శివసాగర్ ‘అమ్మా’ కవితలను కూడా వాటి స్ఫూర్తిని కళ్లకు కట్టేలా ఆవిష్కరించారు. రుక్కులు కవితని ప్రేక్షకులను ఇన్వా ల్వ్ చేస్తూ ప్రదర్శించడంతో ఆడిటోరియం మొత్తం ఆ సందడితో నిండిపోయింది. ‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని’ అన్న సినారె గజల్‌ని భావయుక్తంగా ఆలపించి ఆ సారాన్ని మనసుల నిండా చిలకరించారు. విజువల్ ఎఫెక్ట్‌కి తోడు నేపథ్య సంగీతం కూడా ఫీల్‌ని మరింత పెంచింది.

ఈ ఏడాది మార్చి నెల రెండో వారంలో ఝాన్సీకి, మరొక సాహితీ మిత్రునికి తట్టిన ఆలోచనే ఈ థియేటర్ గ్రూపునకి నాంది. కొత్త సబ్జెక్టు తో ఏదైనా ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది వారి మనసులో మాట. ఆ చేసేదేదో కవిత్వంతోనే ప్రయోగం చేద్దామన్న పట్టుదలా కలిగింది. వెంటనే కవితల ఎంపిక మొదలుపెట్టి.. ఎంచుకున్న వాటిలోంచి జల్లెడపట్టి చివరికి పాతి క కవితలను ఫైనల్ చేశారు. వాటిని ఎలా ప్రదర్శిస్తే బాగుంటుందని ఊహలు చేస్తూనే ప్రదర్శకులు, సహయకులతో టీమ్‌ని తయారుచేశారు. అలా కూడుకున్నదే ‘టీమ్ జె’ బృందం. ఇందులో సాంకేతిక సిబ్బంది మాత్రమే అనుభవజ్ఞులు. ప్రదర్శకులు అయిదుగురు థియేటర్‌కి పూర్తి కొత్తవారు. అయినా నిస్సంశయంతో సాధన చేసి ప్రశంసలకు పాత్రులయ్యారు.
ఈ అయిదుగురి గురించి ఓ ముచ్చట చెప్పా లి. సినిమా, టీవీ రంగాలతో పరిచయమున్న కుటుంబ నేపథ్యమే వీరందరిది.

కానీ ప్రవేశం మాత్రం జరగలేదు. అవకాశమొస్తే ప్రతిభకి పదు ను పెట్టుకుని ముందుకెళ్లాలన్న తపన మెండుగా ఉంది. ఈ అంశాన్ని దగ్గరగా గమనించిన ఝా న్సీ వీరిని తన టీమ్‌లోకి తీసుకున్నారు. పాతిక కవితలను వారి చేతిలో పెట్టి గడువు నిర్దేశించా రు. పనిలోకి దింపారు. ఈ పిల్లలు కూడా దాన్ని సవాల్‌గా తీసుకున్నారు. ఏప్రిల్ నెల చివరినాటికి ప్రతి ఒక్కరూ మొత్తం కవితలను కంఠతా పట్టా రు. జూమ్ ద్వారా ఉమ్మడిగా కూడా ప్రాక్టీస్ చేశా రు. మే నెలలో తొలి పది రోజులు ప్రత్యక్షంగా కలుసుకుని రిహార్సల్స్ చేశారు. అదే సమయంలో కవితల ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచనలు పంచుకుని మొత్తం ప్రదర్శనకి ఒక రూపం తెచ్చారు. ఆ తదుపరి ఎనిమిది రోజుల వ్యవధిలోనే రెండు ప్రదర్శనలిచ్చారు. తొలి ప్రదర్శన కంటే రెండో ప్రదర్శనలో వారి సునాయాస విన్యాసానికి ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్‌తో జేజేలు పలికారు. షోకి టిక్కెట్ పెట్టినా రంగభూమి హాలు కిటకిటలాడింది. ఈ అదుగుగురిలోని అభినయ కౌశలం, వాచక విన్యాసం వల్లే ఇది సాధ్యమైంది. డ్రెస్ కోడ్ కూడా టీమ్ స్పిరిట్ ని మరింత పండించిందని చెప్పుకోవాలి. చివరి అంకంలో ’మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి’ అంటూ గ్యాలరీలో కూ ర్చున్న ప్రేక్షకులను వేదికపైకి పిలిచి ఆడి పాడించిన ఘట్టం అందరిలో జోష్‌ని నింపింది.

ప్రదర్శకులు అయిదుగురు 17నుంచి 23 ఏళ్ల లోపువారు. ప్రాథమిక స్థాయి నుంచి వారి విద్యాభ్యాసమంతా ఇంగ్లీష్ మీడియంలోనే. ఒకరిద్దరికి ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్‌గా తెలుగు ఉంది. కానీ అవసరమైనంత పట్టు లేదు. బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధన్య ఉన్నత చదువు కొనసాగిస్తూనే నటన వైపు దృష్టి సారించింది. బికామ్ పూర్తిచేసిన అనిరుథ్ ఎంబి ఎ ఫస్టియర్ చేస్తూ యాక్టింగ్ సైడ్ అవకాశం కో సం ఎదురుచూస్తున్నాడు. బెంగుళూరులో ఉం టూ సోషల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రేరణకి, బిబిఎ చేస్తున్న మనస్వినికి, లెవెన్త్ క్లాస్ చదువుతున్న రాగలీనకి నటన అంటే ఎంతో మ క్కువ. ఇంట్లో నేర్పించిన పద్యాలు, పాటలు తప్ప విడిగా వీళ్లెవరూ కవిత్వం చదివిన వారు కాదు. కానీ ఝాన్సీ తమకి ఇచ్చిన టాస్క్ వారికి నచ్చిం ది. సవాల్‌గా తోచింది.

ఆ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టి ప్రతి కవితనీ కంఠోపాఠం చేసుకున్నారు. వీరికి ఇచ్చినవి ఆధునిక వచన కవితలు. ధారణకి వీలయ్యే ఛందోబందోబస్తులు లేశమైనా లేనివి. వస్తు ప్రధానమే తప్ప అంత్యప్రాసలు కలిగినవి అసలే కావు. ఇందులో కొన్ని చిక్కని సం స్కృత పదబంధాలు, సంక్లిష్ట సమాసాలతో కూడినవి. అయినప్పటికీ ప్రదర్శకులు అయిదుగురు పదాల ఉచ్చారణ సహా ప్రతి కవితలో ప్రతి పంక్తినీ ఎంతో స్పష్టతతో పలికారు. చూడవచ్చినవారిని చకితుల్ని చేశా రు. మొదటి ప్రదర్శన తిలకించడానికి వచ్చినవారిలో ఎనభై శాతానికి పైగా ప్రేక్షకులు ముప్పైలోపు వయసువారే. ఇంగ్లీషు స్పీకింగ్ పిల్లలే. కానీ ఈ ప్రదర్శన వారి ని ఎంతగా ఆకట్టుకుందంటే.. కవిత కవితకీ చి వరన కరతాళధ్వనులతో హోరెత్తించారు. వీరిలో అధికులకి కవిత్వంతో కనీస పరిచయం లేదు. కొందరకి స్వల్ప పరిచయం ఉన్నా ఆ పదార్థ స్వరూప స్వభావాల గురించి ఏమీ తెలీదు. అలాంటి కొందరు ఈ ప్రదర్శన చూశాక స్పందిస్తూ తమకి కవిత్వం పట్ల ఇష్టం ఏర్పడిందని, ఇకపై మనసు పెట్టి చదువుకుంటామని చె ప్పడం హైలైట్ పాయింట్.

నిర్వాహకుల ఆహ్వా నం మేరకు రెండో ప్రదర్శనకి సాహిత్య కళారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రదర్శనానంతరం వారు కూడా అభినందనలు తెలపడం ఆసక్తికర దృశ్యం. ప్రస్తుతానికి తమ ప్రదర్శనకు అనువైనవి అనుకున్న పాతిక కవితలను ‘టీమ్ జె’ బృందం ఎంపిక చేసుకుంది. వీటికే పరిమితమని వారు అ నడం లేదు. మొదటి ప్రదర్శనలో లేని రెండు కవితలను రెండో ప్రదర్శనలో చేర్చారు. అంటే వచ్చే రోజుల్లో కూడా మరిన్ని కొత్త కవితలకు చోటు కల్పించే ఆస్కారముంటుందన్న సంకేతంగా దీన్ని భావించవచ్చు. మొదటి ప్రదర్శన చూసిన వారి లో ఇద్దరు పెద్దలు మరో రెండు ప్రదర్శనలకు స్పా న్సర్ చేస్తామని అప్పటికప్పుడే ప్రకటించారు. ఇ లాంటి ఉదారులు సహకరిస్తే ‘కవిత్వమొక తీరని దాహం’ మరిన్ని చోట్ల ప్రదర్శించే అవకాశముంటుంది. పైగా నిర్వాహకులు దీనినొక ప్రయోజ నం కోసం ప్రదర్శిస్తున్నారే తప్ప పైసా ఆశించడం లేదు. ఒకవేళ ఎవరైనా అవసరానికి మించి ఆర్థిక తోడ్పాటు అందిస్తే ఆ మొత్తాన్ని కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇచ్చి తమ కవితా హృదయాన్ని చాటుకుంటున్నారు. సాహిత్య పోషణకి ఊతం పడుతున్న వీరి కృషి ఎంత వర్ధిల్లితే అంత ప్రయోజనం!

ఒమ్మి రమేష్ బాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News