Wednesday, May 7, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమలు లోకి వచ్చినట్టు అందులో ప్రకటించింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీం కోర్టు గత జనవరిలో తీర్పువెలువరించిన నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం 2025 గా నామకరణం చేసింది. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద ఆస్పత్రుల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థం ఉన్న ఆస్పత్రులనూ ఈ పథకం

కిందికి తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో సూచించింది. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తెచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ తమ వద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆస్పత్రికి పంపాల్సి ఉంటుంది. అందుకోసం సదరు ఆస్పత్రివారే రవాణా సౌకర్యాలు కల్పించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్యసేవలు అందించిన ఆస్పత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ పర్యవేక్షణకు రోడ్ సెక్రటరీ కింద 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ హెల్త్ అథారిటీ సిఇఒ, ఎంఒఆర్‌టిహెచ్ అడిషనల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. 2024 మార్చి 14న కేంద్ర రోడ్డు రవాణా , జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ ఛండీగఢ్‌లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ తరువాత ఆరు రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News