హైదరాబాద్లోని తిలక్ నగర్లో దాదాపు రూ.4 కోట్లకి పైగా విలువ చేసే ఇంటిని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి దేవుడికి విరాళంగా అందజేశారు. చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దేవుడి పేరు మీదకు యాదగిరిగుట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వెంకటరావు సమక్షంలో ఆ భవంతిని గురువారం ట్రాన్స్ఫర్ చేయించారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు తిలక్ నగర్లోని తనకు ఉన్న 152 గజాలలో నిర్మితమైన జీ+3, పెంట్ హౌస్ కలిపి ఉన్న సొంత ఇంటిని దేవస్థానానికి అందజేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను ఆయన ఈవో వెంటకరావుకి,
ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, దేవస్థాన అధికారుల సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరావు, దాత వెంకటేశ్వర్లును స్వామివారి కండువాతో సన్మానం చేశారు. స్వామివారి ప్రసాదం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి మీద భక్తితో విలువల ప్రాపర్టీని ఆలయానికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడైనా ఆలయానికి వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చని చెప్పారు. స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా దాత ముత్తినేని వెంకటేశ్వర్లును రాష్ట్ర దేవాదాయ శాఖ కొండా సురేఖ, ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా అభినందించారు.