Thursday, June 19, 2025

జిఒ 49తో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది

- Advertisement -
- Advertisement -

కవ్వాల్, తడోబా టైగర్ జోన్ పరిరక్షణ పేరిట తెచ్చిన జిఒ 49తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందని బిఆర్‌ఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఈ జిఒ అనేక తప్పుల తడక అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న అనేక ఆర్టికల్స్‌ను ఈ జిఒ ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది ఆదివాసీ గిరిజన గూడేల ప్రజల నిర్వాసితులను చేసే కుట్రతో జిఒ 49 తెచ్చారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎంఎల్‌ఎ కోవాలక్ష్మి, బిఆర్‌ఎస్ నేతలు తుంగ బాలు, అభిలాష్ రంగినేని,ఆసిఫాబాద్ స్థానిక నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, ఈ జిఒతో ఆదివాసీ గిరిజనులు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారని అన్నారు. పత్తి విత్త లేకపోతున్నారు…నాట్లు వేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అడుగడుగునా గిరిజన ఆదివాసీల హక్కులకు రేవంత్ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. టైగర్ కంజర్వేషన్ పేరిట గిరిజన ఆదివాసి గూడేలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ పోడు భూములకు పట్టాలిస్తే రేవంత్ రెడ్డి ఆ భూముల నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. పీసా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ జిఒ 49 తెచ్చిందని చెప్పారు. ఆపరేషన్ కాగార్‌ను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి టైగర్ కంజర్వేషన్ పేరిట గిరిజన ఆది వాసీలను ఎందుకు ఖాళీ చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు. కవ్వాల్‌తో పాటు మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ల కోసం గిరిజన ఆదీవాసీల పొట్ట గొడుతారా..? అని అడిగారు. వన్యప్రాణి సంరక్షణ చర్యలకు బిఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కెసిఆర్ హయాంలో హరిత హారంతో అటవీ విస్తీర్ణం పెంచారని, కానీ రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలిలో 100 ఎకరాల్లో అడవులను ధ్వంసం చేశారని విమర్శించారు.

జిఒ 49 ఏడు లక్షల గిరిజన ఆదీవాసీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, గిరిజన,ఆదివాసీల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే జిఒ 49ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 339 ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని జీవో 49 లో తప్పుగా పేర్కొన్నారు. డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బిఆర్‌ఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఎస్‌సి,ఎస్‌టిలకు సంబంధించి చేవెళ్లలో మల్లిఖార్జున్ ఖర్గే విడుదల చేసిన డిక్లరేషన్ కూడా మోస పూరితమే అని ఆరోపించారు. ఎస్‌సి,ఎస్‌టిలను కెసిఆర్ గుండెల్లో పెట్టుకుని చూస్తే రేవంత్ రెడ్డి డిక్లరేషన్ల పేరిట మోసం చేశారని అన్నారు. ఎంఎల్‌ఎ కోవాలక్ష్మి మాట్లాడుతూ, ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనుల నివాసం ఉంటున్న భూమిని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌కు ఇస్తున్నట్లు ప్రభుత్వం జిఒ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గిరిజనులు భయపడుతున్నారని అన్నారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని…కానీ, గిరిజనుల గూడేల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జిఒ 49ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News