ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఇద్దరు చిన్నారులతో మారుమూల గుహలో జీవిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో ఆమె జీవిస్తున్న వైనం వెలుగుచూసింది. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో కూడిన ఈ సహజ గుహలో రెండు వారాలుగా ఆమె జీవనం సాగిస్తోంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తోంది. గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ పెట్రోలింగ్ బృందం రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట దుస్తులు ఉండడాన్ని గమనించారు. దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్యాకు చెందిన ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు.
ఆమెతో పాటు ఆరేళ్ల కుమార్తె ప్రేయ, నాలుగేళ్ల అమా ఉన్నారు. రెండు వారాలుగా వన్యమృగాలు, విషసర్పాలు ఉండే ఇక్కడి క్లిష్ట వాతావరణంలో ఎలా జీవనం సాగించారు, ఏమి తిన్నారో తెలియక పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిజినెస్ వీసా మీద రష్యా మహిళ ఇక్కడకు వచ్చిందని, అది 2017లోనే గడువు తీరిందని పోలీసు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇంతకాలం ఆమె ఎక్కడ ఉందనేది తెలియనప్పటికీ హిందుత్వం పట్ల ఆకర్షితురాలై గోవా నుంచి గోకర్ణకు వచ్చినప్పుడు ఆక్కడి పర్వత ప్రాంతంలోని ప్రదేశాన్ని చూసి ముగ్దురాలైనట్లు భావిస్తున్నారు. అయితే పోలీసులు ఆమెను ఒప్పించి గుహ నుంచి వారిని బయటకు తీసుకువచారు. స్థానిక సాధ్వి ఒకరు నడుపుతున్న ఆశ్రమానికి తరలించారు. ఇమిగ్రేషన్ అధికారులతో సంప్రదించి ఆమెను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.