సకుటుంబంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.(SV Krishna Reddy) 32 ఏళ్ల కెరీర్లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆదివారం ఆయన పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్ ఎఫ్ఎన్సీసీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రాజేంద్రప్రసాద్, రోజా, మురళి మోహన్, బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ..-‘కుటుంబ కథా చిత్రాలను రూపొందించి ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన ఒక చిన్న సినిమా తీసినా అది చాలా పెద్ద విజయాన్ని అందుకునేది’ అని తెలిపారు.
నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. ‘ఎస్వీ కృష్ణారెడ్డి ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడిన వ్యక్తిని నేను. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఎన్నో వైవిధ్యమైన గొప్ప చిత్రాలను రూపొందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ సినిమాల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాట్లాడుకుంటారు’ అని అన్నారు. దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు, ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లు స్వతహాగా మంచి టాలెంట్ ఉన్నవారు. నా మూవీస్ ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేగానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, నా వెంటే అండగా నిలబడిన అచ్చిరెడ్డికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అలాగే హీరోగా నటించి నా మొదటి మూవీకి అవకాశం ఇచ్చిన రాజేంద్రప్రసాద్కి థ్యాంక్స్’ అని పేర్కొన్నారు.