వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పేరు వినగానే ఆయన డాషింగ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తుంది. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే.. మొదటి బంతికే బౌండరీ బాదడం సెహ్వాగ్ నైజం. అయితే ఎంతటి క్రికెటర్ అయినా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోతాడు. కానీ, ఆ దశ నుంచి బయటపడి తిరిగి ఫామ్ సంపాదించుకుంటేనే గొప్ప ప్లేయర్ అనిపించుకుంటాడు. అలాంటి పరిస్థితే సెహ్వాగ్కి కూడా ఎదురైంది. 2011 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో సెహ్వాగ్ కూడా ఉన్నారు. కానీ, దానికి మూడేళ్ల ముందే సెహ్వాగ్ వన్డేల నుంచి రిటైర్ అవుదామని అనుకున్నారట. కానీ, భారత క్రికెట్ దిగ్గజం, సెహ్వాగ్కి అత్యంత సన్నిహితుడైన సచిన్ టెండూల్కర్ అప్పుడు సెహ్వాగ్ని ఆపారట. ఈ విషయాన్ని సెహ్వాగ్ తాజాగా వెల్లడించారు.
2007-08 ఆస్ట్రేలియా, శ్రీలంక ట్రై సిరీస్లో తొలి మూడు మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఆ తర్వాత అప్పటి కెప్టెన్ ధోనీ తుది జట్టులో తనకు అవకాశం ఇవ్వలేదని సెహ్వాగ్(Virender Sehwag) తెలిపారు. దీంతో ఫైనల్ జట్టులో ఛాన్స్ రాకుంటే.. ఇక వన్డేల్లో కొనసాగడం వృధా అని భావించానని.. కానీ, ఆ విషయం సచిన్ దృష్టికి తీసుకెళ్లి.. రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు చెప్పానని అన్నారు. అప్పుడు సచిన్ ‘‘వద్దు నాకు 1999-2000 సీజన్లో ఇలాంటి పరిస్థితే వచ్చింది. క్రికెట్ వదిలేద్దామని అనుకున్నా. కానీ, ఆ దశ వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు నీకు అదే దశ నడుస్తోంది.. వెళ్లిపోతుంది కూడా. భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవద్దు’’ అని చెప్పారని పేర్కొన్నారు. దీంతో సెహ్వాగ్ తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు కృషి చేశారట. తద్వారా ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.