సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న
ముఠా అరెస్టు ఇతర రాష్ట్రాల నుంచి
చిన్నారులను తీసుకొచ్చి విక్రయిస్తున్న
ముఠా సభ్యులు 18మందిని అదుపులోకి
తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు
22మందిని విక్రయించినట్లు సమాచారం
15నెలల బాలుడిని రక్షించి బాలల
సంరక్షణ కేంద్రానికి అప్పగించిన పోలీసులు
పసిపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 18 మంది సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పి నరసింహ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు పసిపిల్లల అక్రమ దత్తతలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా దత్తత తీసుకున్న అంజయ్య, నాగయ్యను అరెస్టు చేశామని తెలిపారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. అక్రమ దత్తత గురించి చర్చించడానికి శిశువుల అక్రమ రవాణా ముఠా బృందం సూర్యాపేటకు వచ్చారని, వారు ఇప్పుడు ఇక్కడి హైటెక్ బస్టాండ్లో అందుబాటులో ఉన్నారని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. 18 మంది సభ్యులు కలిగిన పిల్లల అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేశామని తెలిపారు.
సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వివిధ గ్రామాల నుండి ఏడుగురు మగశిశువులు, ముగ్గురు ఆడ శిశువులు, తొమ్మిది మంది మగ శిశువులు, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులు, పెన్పహాడ్కు చెందిన ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్కు చెందిన ఇద్దరు మగ శిశువులు, నల్లగొండ జిల్లాకు చెందిన చిన్న సూరారం ఒక ఆడశిశువు, హైదరాబాద్కు చెందిన ఒక మగ శిశువులను రక్షించి నల్లగొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో యాదగిరి, ఉమారాణి అనే ఒక వ్యక్తులు గుడ్ల పంపిణీ వృత్తి చేస్తూ పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి తెలుసుకుని ఆడ, మగ శిశువులకు అనుగుణంగా వారి కమీషన్ 10 వేల నుండి 2 లక్షల వరకు కలిపి మొత్తం 5 నుంచి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకుని అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలను వారికి అందించేవారని తెలిపారు. పైన పేర్కొన్న గ్రామాలను సందర్శించి రా మధ్యవర్తిత్వం ద్వారా శిశువులను తల్లిదండ్రులకు పిల్లలను అక్రమంగా దత్తత ఇచ్చేవారని అన్నారు. వీరి కారు డ్రైవర్ కూడా ఈ విషయాలు అన్నీ తెలుసని తెలిపారు.
తదుపరి నిందితులను సూర్యాపేట కోర్టు ముందు హాజరుపరుస్తామని అన్నారు. సూర్యాపేట డిఎస్పి నేతృత్వంలో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిపిఎస్ సూర్యాపేట పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రాజశేఖర్, సూర్యాపేట రూరల్ సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, పెన్పహాడ్ ఎస్ఐ గోపి కృష్ణ, చివ్వెంలఎ స్ఐ మహేష్, సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలు నాయక్, సిసిఎస్ సిబ్బందిని ఎస్పి అభినందించారు.