శాస్త్రవేత్తలు జె.వి. నార్లీకర్, ఎమ్.ఆర్. శ్రీనివాసన్ కనుమూయడానికి మూడు రోజులు ముందు భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి సైన్స్ మ్యూజియమ్, సైన్స్ సెంటర్, సైన్స్ పార్క్, సైన్స్ సిటీ వంటి విలక్షణమైన, వైవిధ్యమైన కృషి చేసిన సరోజ్ ఘోష్ మే 17న అమెరికాలోని సియాటెల్ నగరంలో గతించారు. బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలాజికల్ మ్యూజియమ్ డైరెక్టర్గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ డైరెక్టర్ జనరల్గా, ఇంకా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ అధ్యక్షులుగా సేవలందించిన ప్రతిభావంతుడు సరోజ్ ఘోష్ 1935 సెప్టెంబర్ 1న కోల్కతాలో జన్మించిన సరోజ్ అక్కడే జాదవపూర్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. తర్వాత 1958లోనే కోల్కతాలో నిర్మాణంలో ఉన్న బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలాజికల్ మ్యూజియమ్ లో టెక్నికల్ ఆఫీసర్గా చేరారు.
1970 దశకంలో ఘోష్ అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఎస్ డిగ్రీని, పిమ్మట స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ నుంచి పరిశోధక పట్టాను గడించారు. తర్వాత జాదవ్పూర్ యూనివర్శిటీ నుంచి పిహెచ్డి పొందారు. అమెరికాలో ఉన్నప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని (San Francisco‘)ది ఎక్స్ప్లోరటోరియమ్’లో పిల్లలు సైన్స్ ఎగ్జిబిట్స్ చూస్తూ, వాటితో అంతర్భాగమవుతూ సైన్స్ నేర్చుకునే విధానం ఆయనను ఆకట్టుకుంది. ఇదే ముందు ముందు ఘోష్ చేయబోయే సైన్స్ మ్యూజియమ్స్ అద్భుతాలకు బీజప్రాయమైన స్ఫూర్తిగా మారింది. 1950 దశకం మొదట్లోనే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కె.ఎస్. కృష్ణన్, పశ్చిమ బెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ బి.సి. రాయ్ సంయుక్తంగా సైన్స్ వ్యాప్తికి మ్యూజియమ్స్ నిర్మాణాలు అవసరమని ప్రణాళికలు వేశారు.
ఇందులో భాగంగా మొదట 1956 లో బిర్లా మ్యూజియమ్, పిలని; సైన్స్ మ్యూజియమ్, ఢిల్లీ ఏర్పడగా; 1959లో కలకత్తాలోని బిర్లా ఇండస్ట్రియల్ & టెక్నాలాజికల్ మ్యూజియమ్ 1959లో మొదలైంది. 1965లో బెంగళూరులో విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలాజికల్ మ్యూజియమ్ వచ్చింది. 1978లో ఈ సైన్స్ మ్యూజియమ్స్ను పర్యవేక్షించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ కొత్తగా ఏర్పడి, సరోజ్ ఘోష్ డైరెక్టరయ్యారు. అంతర్జాతీయ బాలల సంవత్సరమైన 1979లో అప్పటి ముంబైలోని 30 లక్షల మంది పిల్లలకు ఒక విజ్ఞానవంతమైన బహుమతి ఇవ్వాలని సరోజ్ ఘోష్ భావించారు. అంతే, వర్లీలోని మునిసిపల్ గార్బేజి పేరుకుపోయిన చోటు ప్రపంచంలోనే తొలి సైన్స్ పార్క్ రావడానికి దారి చూపింది. కేవలం చూడటమే కాకుండా పిల్లలు అందులో అంతర్భాగమై ఒకవైపు వినోదంగా ఆనందిస్తూ మరోవైపు సైన్స్ సూత్రాలను అర్థం చేసుకుంటూ అనుభవం పొందే ఇంట్రాక్టివ్ విధానంలో దీనిని రూపొందించారు.
పూర్తి హంగులతో ఇది ముంబైలో 1985 నవంబర్ 11న నెహ్రూ సైన్స్ సెంటర్గా మొదలైంది. 1986 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్కు తొలి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్న సరోజ్ ఘోష్ అంతర్జాతీయ స్థాయిలో మెగా ట్రావెలింగ్ సైన్స్ ఎగ్జిబిషన్ను ‘ఇండియా: ఎ హెరిటేజ్ ఆఫ్ సైన్స్’ పేరున విభిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఫలితంగా అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, బల్గేరియా, చైనా, బాంగ్లాదేశ్ మొదలైన దేశాలలో సైన్స్ ప్రాచుర్యానికి సంబంధించి మనకు గొప్ప పేరు లభించింది. 1992లో మెగా సైన్స్ సెంటర్ను ‘సైన్స్ సిటీ’ పేరున నగరంలోని ఎక్కువ జనాభాకు వినూత్నంగా సైన్స్ను తెలియజెప్పే పద్ధతిలో స్పేస్ థియేటర్, మోషన్ సిములేటర్, కన్వెన్షన్ సెంటర్ వంటి వాటితో రూపొందించడానికి కోల్కతాలో శ్రీకారం చుట్టారు. నిర్వహణకు అదనంగా వనరుల అవసరం లేకుండా, ఆదాయం పొందుతూ సాగే రీతిన కోల్కతాలో 50 ఎకరాల స్థలంలో మొట్టమొదటి సైన్స్ సిటీ 1997లో మొదలైంది.
దినసరి 15 లక్షల మంది సందర్శకులతో ఇది మన దేశంలో అగ్రస్థానంలో ఉంది. తన 18 ఏళ్ల సర్వీసులో దేశవ్యాప్తంగా 18 చోట్ల సైన్స్ సంబంధించిన మ్యూజియమ్\ సెంటర్ \ పార్క్ \ సిటీలను సరోజ్ ఘోష్ ఏర్పరచారు. 1997 లో ఆయన పదవీ విరమణ చేసినా, తన ఉద్యమం ఆగలేదు. కోల్కతా మ్యూజియం సొసైటీ వారికి కోల్కతా పెనోరమా ఇంకా పార్లమెంట్ మ్యూజియమ్, రాష్ట్రపతి మ్యూజియమ్ రూపుదిద్దుకోవడానికి కృషి చేశారు. అహ్మదాబాద్లో సైన్స్ సిటీ సంబంధించిన కృషి చేశారు. భారత రాష్ట్రపతికి మ్యూజియమ్ అడ్వైజర్ గా కూడా పని చేశారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవంతో పాటు, నేషనల్ సైన్స్ అకాడమీ వారి ఇందిరా గాంధీ ప్రైజ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సైన్స్ పాపులైజేషన్ అవార్డు, ఎన్సిఎస్టిసి వారి చిల్డ్రన్ సైన్స్ పాపులరైజేషన్ అవార్డు వంటివి పొందారు. పిల్లలకే కాకుండా అందరికీ సైన్సు పట్ల జిజ్ఞాస, అవగాహనను వినోదంతో పాటు ఆహ్లాదంగా కలిగించే ఉద్యమానికి నాయకుడైన సరోజ్ ఘోష్ కనుమూసినప్పుడు ఆయన కోరిక మేరకు తన శరీరాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీ ఫర్ సైంటిఫిక్ స్టడీస్కు అందజేశారు. సరోజ్ ఘోష్ ప్రారంభించిన ఈ వినూత్న సైన్స్ ప్రచారోద్యమం రోజురోజుకు మరింత మందిని ఆకర్షిస్తూ సాగుతోంది.
- డా. నాగసూరి వేణుగోపాల్
9440732392