న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ (సవరణ)చట్టం2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ష్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది.
ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ ) చట్టం 2025 ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100 కు పైగా పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకొనేందుకే అని వీటిల్లో ఆరోపించాయి. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్, ప్రైవేట్ ఆక్రమణలకు గురి కాకుండా రక్షించడానికి అని వాదించింది. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్ లో పార్లమెంట్ ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీం కోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు.