1873 నాటి బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ రూపంలో బ్రిటిష్ కాలం నాటి ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పి) వ్యవస్థ ఇప్పటికీ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంలాంటి కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. స్థానికేతరులు సాంస్కృతికంగా, భౌగోళికంగా సున్నితమైన ఈ ప్రాంతాల్లో తిరగడాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఐఎల్పి ఆధునిక ఫెడరల్ ప్రజాస్వామ్యంలోనూ కొనసాగుతుండడంపై చర్చలు రేకెత్తిస్తున్నాయి. నాగాలాండ్లో సవరించిన ఐఎల్టి నిబంధనలు, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కఠినంగా అమలు చేయడం లాంటి తాజా పరిణామాలు భారత రాజ్యాంగం కింద గ్యారంటీ ఇచ్చిన స్వేచ్ఛగా తిరగడం అనే మౌలిక హక్కును చట్టవ్యతిరేకంగా నిరోధిస్తోందా? అనే ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఈ వ్యాసం ఐఎల్పి సమర్థనీయతను మౌలిక హక్కులపై దాని పరిణామాలు స్థానికేతరులు ఎదుర్కొనే వేధింపులు అన్నిటికీ మించి ఎలాంటి చర్యలు లేకుండా సరిహద్దు రాష్ట్రాలను పరిరక్షించగలమా అనే విస్తృత సమస్యను పరిశీలించనున్నది.
తేయాకు, చమురు, కలప వంటి వనరులు పుష్కలంగా ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇతరుల రాకను పరిమితం చేయడం ద్వారా తమ వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం బ్రిటిష్ వాళ్లు ఈ ఐఎల్పి విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతరం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్లలో స్థానిక తెగల సాంస్కృతిక ఉనికి, భౌగోళిక సమతుల్యతను పరిరక్షించడం కోసం ఈ వ్యవస్థను అలాగే ఉంచారు. తాజాగా 2019లో మణిపూర్ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ రాష్ట్రాల వెలుపలి భారతీయ పరిమిత కాలం అంటే పర్యాటకులుగా 1530 రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడానికి అనుమతి తప్పనిసరి. విదేశీయులకైతే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ (పిఎపి) అవసరం. ఇది పొందడం చాలా కష్టం. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ (Bangladesh, Myanmar) ల నుంచి ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు తనిఖీలు లేని వలసలను నిరోధించడం కారణంగా గిరిజన తెగల ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం పరిరక్షించడానికి, భౌగోళిక మార్పులను నిరోధించడానికి ఈ ఐఎల్పి అవసరమని సమర్థించుకోవచ్చు.
ఉదాహరణకు దేశీయ పర్యాటకులకు రూ. 200 ఫీజు, దిమాపూర్లో కఠినంగా అమలు చేయడం వంటి నాగాలాండ్లో ఇటీవల చేసిన మార్పులు బంగ్లాదేశ్లో రాజకీయ అశాంతి తర్వాత చట్టవ్యతిరేక వలసల పట్ల ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో సరియైన పత్రాలు లేని వలసదారులను గుర్తించడానికి జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయడం లాంటి తీవ్రమైన అణచివేతలు భద్రత, భౌగోళిక సుస్థిరత పట్ల రాష్ట్రాల దృష్టిని నొక్కి చెబుతున్నాయి. స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి, దేశంలో ఎక్కడైనా స్థిరపడడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి), (ఇ) గ్యారంటీ ఇస్తోంది. అయితే గిరిజన తెగలు లేదా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం ఆర్టికల్ 19(5) కింద కొన్ని పరిమితులు విధించవచ్చు. కానీ అసమాన నిబంధనావళిని రూపొందించడం ద్వారా ఐఎల్పి ఈ హక్కులను ఉల్లంఘిస్తోందని విమర్శకులు వాదిస్తారు. ఎందుకంటే ఐఎల్పి రాష్ట్రాలలోని నివసించేవారు దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.
కాని మిగతా రాష్ట్రాల వారు ఈ ప్రాంతాల్లో ప్రవేశించడానికి బ్యూరోక్రాటిక్ అడ్డంకులు, ఫీజులు లాంటి వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది.సమాఖ్య దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలనే నిబంధన విషయంలో ఈ అసమానత ప్రశ్నలను లేవనెత్తుతోంది. సరిహద్దు ప్రాంతాల ప్రత్యేకమైన సామాజిక సాంస్కృతిక జీవనం, భౌగోళిక సున్నితత్వం దృష్టా స్థానిక తెగల ప్రయోజనాల పరిరక్షణకు ఐఎల్పి లాంటి పరిమితులు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే రాజ్యాంగ అధికరణలు 14(సమానత్వం), 15 (వివక్ష రహితం), 21 (జీవించే, స్వేచ్ఛ హక్కు) లాంటి వాటికి ఐఎల్పి అడ్డుగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు స్థానికేతరులు అనుమతులు పొందడం, గుర్తింపు పత్రాలు సమర్పించడం, కొన్ని సందర్భాల్లో స్థానిక స్పాన్షర్ షిఫ్ పొందడం లాంటి ఆంక్షలు తమను వేరుగా చూస్తున్నారనే భావనను సృష్టించడమే కాకుండా జాతీయ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
రక్షణ కోసం ఉద్దేశించిన ఐఎల్పి వ్యవస్థ స్థానికేతరులు వేధింపులకు తరచూ దారితీస్తోంది. arunachalilp. com, ilp.nagaland.gov.in లాంటి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా స్ట్రీమ్లైన్ చేసినప్పటికీ దరఖాస్తు ప్రక్రియ చాలా మందికి ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. దరఖాస్తు దారులు ఆధార్, పాన్, లేదా ఓటర్ గుర్తింపు కార్డు లాంటి గుర్తింపు పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కొన్ని సందర్భాల్లో వసతికి సంబంధించిన ధ్రువీకరణ లేదా స్థానిక రెఫరెన్స్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అరుణాచల్ప్రదేశ్లో ఒక ఇఐఎల్పికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది. అదే తక్షణ ఇఐఎల్పికి రూ. 400 ఖర్చు అవుతుంది. ఇవి ఆర్థికంగా భారం కూడా. నాగాలాండ్ స్థానిక పర్యాటకుల కోసం రూ. 200, ఇతర కేటగిరిల వారికి ఎక్కువ ఫీజులతో ఫీజుల వ్యవస్థను సవరించింది. ఇది సందర్శకులకు మరింత భారంగా తయారైంది. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దుల వెంబడి చెక్ గేట్ల వద్ద తనిఖీల అమలు గందరగోళంగా,భయపెట్టే విధంగా ఉంటున్నాయి.
ఆలస్యాలు, ఏకపక్ష తిరస్కరణలు, అదనపు డాక్యుమెంట్లు కోసం డిమాండ్లు లాంటివి ఉంటున్నాయని పర్యాటకులు అంటున్నారు. నాగాలాండ్లో వాణిజ్య ప్రాధాన్యత దృష్టా దిమాపూర్ చారిత్రకంగా మినహాయించినప్పటికీ తాజాగా దిమాపూర్, చుమౌకేడిమా, న్యూలాండ్లను ఐఎల్పి పరిధిలోకి చేర్చడంతో మరింత కఠినమైన తనిఖీలకు దారి తీస్తోంది. దీంతో దిమాపూర్ను ట్రాన్సిస్ట్ హబ్గా ఉపయోగించుకునే అంతర్రాష్ట్ర పర్యాటకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారు జరిమానాలు లేదా వెనక్కి తిప్పి పంపించడం లాంటి శిక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో నిబంధనలు గురించి తెలియని పర్యాటకులలో ఆందోళన పెరిగిపోతోంది. ఈ వేధింపులు దీనికే పరిమితం కాలేదు. స్థానిక అధికారులు లేదా తెగల నుంచి స్థానికేతరులు అనుమానాలు, వేధింపులు లాంటివి ఎదుర్కోవలసి ఉంటుంది. ఫలితంగా స్థానికేతరులు ఈ రాష్ట్రాల్లో అభద్రతా భావానికి గురవుతున్నారు.
ముఖ్యంగా మయన్మార్, బంగ్లాదేశ్, చైనాలతో చొరబాట్లకు వీలున్నాయి. సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో చట్టవ్యతిరేక వలసలను నివారించడానికి, గిరిజన సంస్కృతులను పరిరక్షించడానికి ఐఎల్పి అవసరమని దీన్ని సమర్థించేవారు వాదిస్తారు. ఈ వ్యవస్థ పెద్ద ఎత్తున చొరబాట్లను నిరోధించడానికి, సందర్శకులపై నిఘా ఉంచడానికి ఈ రాష్ట్రాలలోని స్థానికులకే పరిమితమైన భూమి హక్కులను పరిరక్షించడానికి తోడ్పడుతుందని వారు అంటారు. అయితే ఐఎల్పికి ప్రత్యామ్నాయాలు కూడా స్వేచ్ఛగా తిరగడంపై పరిమితులు లేకుండా ఇలాంటి లక్షాలనే సాధించగలవు. సరిహద్దు భద్రతను పెంచడం, బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు, ఇప్పుడున్న వలస చట్టాలను కఠినంగా అమలు చేయడం లాంటివి చట్ట వ్యతిరేక వలసలను నిరోధించగలవు. భౌగోళిక ముప్పులు లేకుండా స్థానిక గిరిజనులు ఆర్థికంగా లబ్ధిపొందే కమ్యూనిటీ ఆధారిత పర్యాటక విధానాలు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించగలవు. బంగ్లాదేశ్లో విశాలమైన సరిహద్దులను కలిగి వున్న , ఐఎల్పి చట్టాలు లేని అసోం, త్రిపుర లాంటి రాష్ట్రాలు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి), సరిహద్దు గస్తీ లాంటి ఇతర విధానాలపై ఆధారపడుతున్నాయి. అయితే వీటిపైనా కూడా విమర్శలు లేకపోలేదు.
చట్టవ్యతిరేక వలసలను నిరోధించడంలో ఐఎల్పి సమర్థతపైన కూడా అనుమానాలున్నాయి. దీన్ని అమలు చేస్తున్నప్పటికీ సరియైన పత్రాలులేని వలసదారులకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి. అంతేకాకుండా కార్మికులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం, పెట్టుబడులను నిరోధించడం ద్వారా ఆర్థిక ఏకీకరణను ఐఎల్పి దెబ్బ తీస్తుందని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఈశాన్య భారతం అభివృద్ధిని ఇది దెబ్బ తీసిందని వారు వాదిస్తున్నారు. ఒకవేళ దేశంలోని ప్రతి రాష్ట్రం ఐఎల్పి లాంటి విధానాన్ని అమలు చేసిన పక్షంలో జాతీయ ఐక్యత, ఆర్థిక ఏకీకరణపై దాని దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. భారత దేశ సమాఖ్య వ్యవస్థకు హాల్ మార్క్ గా ఉన్న ‘ఫ్రీ మూవ్మెంట్’ తీవ్రంగా దెబ్బ తినడంతో పాటు దేశాన్ని పరిమితమైన జోన్లతో కూడిన కూటమిగామార్చివేస్తుంది. అంతేకాకుండా కార్మికులు ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్లడమనేది తగ్గిపోతుంది. ఫలితంగా ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయి.
ఐఎల్పియేతర రాష్ట్రాలకు చెందిన చిన్న వ్యాపారులు , కార్మికులు ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఫలితంగా వారి జీవనోపాధులు దెబ్బ తింటాయి. ఇలాంటి పరిస్థితి ప్రాంతీయతత్వాన్ని పెంచడంతో పాటు రాష్ట్రాల మధ్య అపనమ్మకానికి కూడా దారి తీస్తుంది. అంతేకాదు సమైక్య భారతమనే రాజ్యాంగదృష్టిని సైతం ఇది నీరు గారుస్తుంది. ఈశాన్య భారతానికి చెందిన ఐఎల్పి రాష్ట్రాలు, రక్షిత హోదాల దృష్టా పౌరసత్వ సవరణ చట్టం (2019) లాంటి జాతి విధానాల నుంచి మినహాయించబడ్డాయి. అయితే దేశ వ్యాప్తంగా ఇలాంటి మినహాయింపులు పాలనాపరంగా గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా ఫెడరల్ గవర్నెన్స్ను బలహీనం చేస్తుంది. ఐఎల్పి వ్యవస్థ స్థానిక ఉనికిలను కాపాడడం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మధ్య సున్నితమైన బ్యాలెన్స్కు అద్దంపడుతోంది.
గిరిజన సంస్కృతులు, సరిహద్దు భద్రతను పరిరక్షించడమనే దాని ఉద్దేశం సరియైనదే కావచ్చు కాని పర్మిట్ల ప్రక్రియలను హేతుబద్ధం చేయడం, తగ్గించడం, పారదర్శక అమలు ఉండేలా చూడడమనే కొన్ని సంస్కరణలు అవసరమని స్థానికేతరులు ఎదుర్కొంటున్నవేధింపులు లాంటివి చెబుతున్నాయి. డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు, సాంస్కృతిక పరిరక్షణ లాంటి ఫండ్స్ లాంటి ప్రత్యామ్నాయాలు కూడా ఇలాంటి పర్మిట్లపై ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. సమాఖ్య దేశంలో విధానాలుభిన్నత్వాన్ని గౌరవిస్తూనే ఐక్యతను పెంపొందించాలి. ఇప్పుడున్న రూపంలో ఐఎల్పి ఈశాన్య భారతాన్ని మిగతా దేశానికి దూరం చేసేలాగా ఉంది. కొన్ని చర్యల ద్వారా ఫ్రీమూవ్మెంట్ స్ఫూర్తిలో రాజీపడకుండానే సరిహద్దు రాష్ట్రాలను పరిరక్షించవచ్చు. దేశ ఐక్యతను పణంగా పెట్టి భద్రత ఉండకూడదనే దానిపై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ ఐఎల్పి చర్చ నొక్కి చెబుతోంది.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
- ( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)