Monday, June 2, 2025

విచారణ వేళ.. విలీనం గోల!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘హమ్మయ్య బతికిపోయాను’ అని కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. ఈ వారంలో మూడు రోజులపాటు జరిగిన ఆయన పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు తన ఏకైక కుమారుడు లోకేష్‌ను దాదాపుగా తన వారసుడిగా ప్రకటించినంత పనిచేశారు. ఎప్పుడో ఒకప్పుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజుల మహానాడులో అప్పుడెప్పుడో 1996లో మరణించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ఆత్మ చేత కూడా లోకేష్ కు ఆశీర్వాదాలు ఇప్పించారు. ఇది చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు సామాజిక మాధ్యమాల్లో నవ్వులపాలు కావడానికి ఉపయోగపడిందే తప్ప పెద్దగా ప్రయోజనం లేకపోయింది. 1996లో తన మరణానికి కొన్ని గంటల ముందు మాట్లాడిన పత్రిక గోష్ఠిలో కూడా ఎన్‌టి రామారావు చంద్రబాబు నాయుడుని ఎంత తీవ్రంగా ద్వేషించారో పత్రికల వాళ్లంతా చూసారు. అలాంటి ఎన్‌టి రామారావు మాట్లాడినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వీడియోను సృష్టించి అందులో చంద్రబాబు నాయుడు పరిపాలనను, లోకేష్ సామర్ధ్యాన్ని ఎన్‌టిఆర్ గొంతుతో ప్రశంసింపజేసి తండ్రీకొడుకులు నవ్వులపాలయ్యారు. ఎన్‌టి రామారావు బొమ్మతో ప్రజలలో

ఓట్లు సాధించుకోవడానికి ఆయన నామస్మరణ చేస్తున్నారే తప్ప ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే ఎన్‌టి రామారావు మరణంతోటే తెలుగుదేశం పార్టీ అనేది అంతరించిపోయింది. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు హరికృష్ణ ప్రారంభించిన అన్న తెలుగుదేశం పార్టీ, ఆయన భార్య లక్ష్మీపార్వతి కొనసాగించిన ఎన్‌టిఆర్ టిడిపి ఎంత ఘోరంగా విఫలమయ్యాయో చూసాం. ఎన్‌టి రామారావు పేరు వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు పార్టీ ఇతరేతర కారణాలవల్ల, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన చనిపోయిన తర్వాత గెలిచిన మూడు సందర్భాల్లో అంటే 1999, 2014, 2024.. ఈ మూడు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కారణం ఒంటరిగా కాకుండా రెండు మూడు పార్టీలను కలుపుకుపోవడమే. చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న పార్టీకి స్వతంత్ర శక్తి లేదు. మొన్నటి మహానాడులో దేశంలో ఏ పార్టీకీ లేని విధంగా కోటిమంది సభ్యులు తమకు ఉన్నారని చెబుతున్నప్పటికీ పదేపదే ‘కూటమిగా మూడు పార్టీలు కొనసాగాల్సిందే, వచ్చే అనేక ఎన్నికల్లో మనందరం కలిసి ఉండాల్సిందే’ అంటూ రాగాలు తీశారు. ఏ రాజకీయ పార్టీ అయినా స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్నన పొంది అధికారంలోకి వచ్చి పరిపాలన చేయాలనుకోవాలి కానీ వాళ్లను వీళ్లను కలుపుకుంటే తప్ప గెలవలేమనే అభిప్రాయం పార్టీ శ్రేణులకు, ప్రజలకు కలిగించిన తరువాత ఇక ఆ పార్టీకి జనంలో విలువ ఏముంటుంది?

సరే, తెలంగాణలో చేతులెత్తేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిన పార్టీ గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో ఒక ప్రధాన రాజకీయ పక్షంలో జరుగుతున్న వారసత్వ పోరాటం కారణం. అందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలు, ఇక్కడ జరుగుతున్న వారసుల కొట్లాటలు చూసి ‘హమ్మయ్య, బతికిపోయాను.. నాకు ఒక్కడే కొడుకు, హాయిగా అతనికి పగ్గాలు అప్పచెప్పేయొచ్చు’ అని సంతోషపడుతుండవచ్చు. తెలంగాణ విషయానికొస్తే భారత రాష్ట్ర సమితిలో అధినేత చంద్రశేఖరరావు కుమార్తె కవిత చేసిన తిరుగుబాటు నిన్నమొన్నటిదాకా టీ కప్పులో తుపానులా సమసిపోతుందని చాలామంది అనుకున్నారు. కవిత అమెరికానుండి తిరిగివచ్చిన తరువాత ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన పరిణామాలవల్ల ఇదంత సులభంగా పరిష్కారమయ్యే సమస్య కాదని అర్థం అయింది.

అక్కడ చంద్రబాబు ఆనందపడుతూ ఉంటే, ఇక్కడ చంద్రశేఖరరావు ఆందోళనలో పడ్డారు. దీనంతటికీ పరిష్కారం నిజానికి ఆయన చేతుల్లోనే ఉంది. కొడుకు, కూతురు మధ్య తలెత్తిన నాయకత్వ వివాదాన్ని ఆ పార్టీలో ఆయన తప్ప ఇంకెవరు పరిష్కరించలేరు. కూతురిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, సముదాయించవచ్చు లేదా కోప్పడి దారికి తెచ్చుకోవచ్చు. కొడుకుకు సంబంధించిన వాళ్లంతా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి చేస్తున్న ప్రచారాల్ని కొడుకుకే చెప్పి ఆపించవచ్చు. రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ మరో శ్రేయోభిలాషి గండ్ర మోహన్ రావు వంటివారిని కెసిఆర్ కవిత దగ్గరికి పంపించడంలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఆయన లేరనే అర్థం ఉన్నది. ఎందుకంటే కవిత లేవనెత్తిన అంశాలు ఇటువంటి మధ్యవర్తుల రాయబారంతో పరిష్కారం అయ్యేవి కాదు. అధినేత స్వయంగా పూనుకోవాల్సిందే. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. ఈలోగా ‘తండ్రికి వారసుడు కొడుకే.. ఆయనే సమర్థుడు’ అన్న విధంగా కెటిఆర్ అభిమానగణం చేస్తున్న హడావుడి పార్టీకి మరింత నష్టం చేస్తుందనే ఆందోళన ఆ పార్టీ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నది.

కవిత మే 2న లేఖ రాసిన తర్వాత అది 20 రోజుల అనంతరం లీక్ కాకుండా ఉంటే ఎలా ఉండేదో తెలియదుగాని, ఆ లీక్ చేసినవాళ్లు ఏ ప్రయోజనం ఆశించినా జరిగింది మాత్రం నష్టమే. లేఖ లీక్‌తో కవిత పూర్తిగా బయటపడ్డారు. చాలామంది ఈ లేఖ తాను రాసింది కాదని కవిత ఖండిస్తారని అనుకున్నారు. అలా జరగకపోగా ఆమె తన లేఖను లీక్ చేసిన దయ్యాల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా కవిత సింగరేణి కార్మికుల మధ్య పని చేయడం కోసం గతంలోనే పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతి అనే సంస్థను ప్రకటించి దానికి అన్ని డివిజన్ల కో ఆర్డినేటర్లను కూడా నియమించారు. బయటికి ఎన్ని మాట్లాడినా ఇది పార్టీని సవాల్ చేయడమే అవుతుంది. అంతేకాదు, ఆమె శుక్రవారం నాడు రెండు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించి అక్కడా ధిక్కారస్వరమే వినిపించారు. ‘నేను పార్టీని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను. కెసిఆరే మా నాయకుడు’ అని చెబుతూనే కవిత శనివారంనాడు తన నివాసం సమీపంలోనే జాగృతి పేరిట కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. అంటే ఇక ఆమె పార్టీ అధికారిక కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లబోరని సంకేతాలు ఇచ్చినట్టే. లేదా ఆమెను తెలంగాణ భవన్‌కు వెళ్ళకుండా ఆ దయ్యాలు కట్టడి చేసినందునే ఆమె వేరే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారా?

పార్టీలోని కొంతమంది బిఆర్‌ఎస్‌ను భారతీయ జనతా పార్టీలో కలిపేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నానని కవిత ప్రతిచోటా నొక్కి చెబుతున్నారు. తాను జైలులో ఉండగానే బిఆర్‌ఎస్- బిజెపి విలీనం ప్రతిపాదనను తనవద్దకు తీసుకువచ్చారని, తాను దాన్ని నిరాకరించారని అంటున్నారు. ఒకవేళ చంద్రశేఖరరావు సీరియస్‌గా తను పార్టీ నడపలేనని అనుకుని బిజెపిలోనో, ఇంకో పార్టీలోనో విలీనం చేయాలనుకుంటే కవిత వద్దంటే ఆగుతుందా? భారతీయ జనతా పార్టీ మీద కవితకు కోపం, వ్యతిరేకత ఉండడం సహజం. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డియే కనుసన్నలలో నడిచే కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను మద్యం కుంభకోణంలో నిందితురాలిగా చేర్చి ఆరు మాసాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ కు వెళ్లేట్టు చేసినందుకు ఆగ్రహం ఉండొచ్చు. అసలు కెసిఆర్ గాని, భారత రాష్ట్ర సమితిలోని ఇతర ఏ నాయకులు గానీ 24 సంవత్సరాలపాటు అస్తిత్వంలో ఉన్న

ఒక ఉద్యమ సంస్థనుంచి బలమైన రాజకీయపక్షంగా రూపొంది రెండు పర్యాయాలు ప్రజాతీర్పు పొంది అధికారంలో ఉన్న పార్టీని అంత ఆషామాషీగా ఓ జాతీయ పార్టీలో కలిపేసే ఆలోచన చేస్తారా? 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన రాగానే లేదా పార్లమెంట్లో ఆమోదం పొందగానే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి ఉంటే అది వేరు. అప్పటిదాకా కెసిఆర్ ఆ మాట చెబుతూ వచ్చారు కూడా. కానీ ఆ తరువాత ఆయన ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేసినట్టుగా దాఖలాలు లేవు, అవసరం కూడా రాలేదు. మరి ఎందుకు పదేపదే బిఆర్‌ఎస్‌ను బిజెపిలో విలీనం చేస్తారనే చర్చ జరుగుతున్నది? అటువంటి అభిప్రాయం కలగడానికి లేదా ఆలోచన రావడానికి ఒక కారణం ఉండొచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత కవితతోసహా కొందరు ఆ పార్టీ నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులలో ఇరుక్కోవడమే ఆ కారణం. ఈ కేసులన్నీ నిజమేనా? రుజువు అవుతాయా లేదా? అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తమ వైరిపక్షాల మీద ఇప్పటివరకూ పెట్టిన కేసుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం.

భారత రాష్ట్ర సమితికి సంబంధించి కవిత ఇప్పటికే మద్యం కేసులో కొద్ది మాసాలు జైలుకు వెళ్లి ఉన్నారు. కెటి రామారావు మీద రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దర్యాప్తు, దానితోపాటు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అదే కేసులో తాను చేరడం, సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రశేఖరరావుకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నుండి పిలుపు రావడం.. ఇవన్నీ చికాకు పరచి రక్షణకోసం పార్టీని బిజెపిలో కలపాలని ఆలోచన చేస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతున్నది. మరి అదే నిజమైతే కవిత భిన్నస్వరం ఎందుకు వినిపిస్తున్నట్టు? నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థ కారణంగా ఇప్పటికయితే ఆమే కదా ఇబ్బంది పడ్డది?

ఏదిఏమైనా ఒకవైపు కెసిఆర్, మరోవైపు సీనియర్ నాయకుడు, కెసిఆర్ కు అత్యంత విశ్వాసపాత్రుడు హరీశ్ రావుతో కలిసి కాళేశ్వరం కమిషన్ ఎదుటకు వెళ్లేందుకు అవసరమైన వాదనలను సిద్ధం చేసుకున్న తరుణంలో కవిత పార్టీ అగ్రనేతకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆమె జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడుగాని, ఇతరత్రా కార్యక్రమాల్లోగాని పార్టీ వారెవరూ పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆమె వ్యతిరేకులు.. నాలుగవ తేదీన ధర్నాకు కూడా ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేస్తారా? ఆమె భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యులుగా ఇంకా ఉన్నారు. మరి పార్టీ పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా లేక తెలంగాణ జాగృతి పేరిట ముందుకు పోతారా చూడాలి. శనివారం నాటి కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంలో మాట్లాడుతూ కవిత అనేక అంశాలను ప్రస్తావించి, జాగృతి వాటన్నిటి మీదా పోరాటం చేస్తుందని చెప్పారు. మరి దేవుడు కెసిఆర్ నాయకత్వంలోని పార్టీని ఈ అంశాల మీద పోరాటం చెయ్యలేని నిర్వీర్య స్థితిలో దయ్యాలు పడేసాయనుకోవాలా? పార్టీనుండి కవిత బహిష్కరణకు రంగం సిద్ధమవుతోందన్న వాదన ఒకవైపు, కవిత సొంత పార్టీ ఏర్పాటుకోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వాదన మరోవైపు వినిపిస్తున్నాయి. ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమైన తెలంగాణ జాగృతి కవిత కొత్త పార్టీ కాబోతున్నదా? అదే జరిగితే రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలలో ఏది లబ్ధి పొందుతుందో వేచిచూడాలి.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News