సెప్టెంబర్ -17 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. కానీ ఆ రోజును ఎలా జరుపుకోవాలని, ఏమని పిలవాలని గడచిన 77 సంవత్సరాలుగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. కొందరు విలీనం అంటారు, మరికొందరు విమోచనమంటారు, ఇంకొందరు విద్రోహమంటారు. గత ప్రభుత్వం సమైక్యత అంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది. చరిత్రలో ఇంత సంక్లిష్టమైన, ఒక నిర్ణయానికి రాని రోజు ఉండక పోవచ్చు. చరిత్రను చారిత్రక నేపథ్యంతో అర్థం చేసుకుంటే ఈ రకమైన సంక్లిష్టతకు అవకాశం ఉండదు. 1947 ఆగస్టు 15న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వస్వతంత్రం అవుతుందని ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించడంతో యావద్దేశం సంబరాల్లో ఉంటే హైదరాబాద్ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేకపోయింది. గత్యంతరం లేక 1947 అక్టోబర్ 29న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఢిల్లీతో యదార్థ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది.
కానీ నిజాం యదార్థ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తనకు సహాయం చేయమని బ్రిటిష్ చక్రవర్తి ఆరవ జార్జికి, ప్రధాని అట్లీకి వ్యక్తిగతంగా లేఖలు రాశారు. నిజాం హైదరాబాద్ సంస్థానం విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేశారు. యదార్థ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్కు 20 కోట్ల రూపాయల రుణ సహాయం అందించారు. హైద్రాబాద్ రాజ్యంలో భారత్ సిక్కాను నిషేధించారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ ఎర్రకోటపై అసఫ్ జాహి పతాకం ఎగరవేస్తానని ప్రగల్భాలు పలికారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం, కమ్యూనిస్టు పార్టీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాయి. దీనితో హైద్రాబాబ్పై చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసింది. సాయంత్రం 7 గంటలకు నిజాం రాజు దక్కన్ రేడియోలో హైదరాబాద్ భారతదేశంలో చేరుతున్నట్లు ప్రకటించాడు. జెఎం చౌదరి మిలిటరీ గవర్నర్గా, నిజాం రాజ్యాధినేతగా వ్యవహరించారు. తర్వాత ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి స్థానాన్ని, మీరు ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్ స్థానాన్ని అలంకరించారు. భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయింది. నిజాం కాలంలో భూస్వాములు, జాగీర్దార్లు, దేశముఖ్లు, రజాకార్లు ప్రజాకంఠకులుగా మారి హత్యాకాండ, అత్యాచారాలు, మారణహోమాలతో హైదరాబాద్ రాజ్యం అట్టుడికిపోయింది.
రజాకార్లు గాండ్లపూర్ వద్ద మహిళలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించారు. నేరెడ గ్రామంలో స్త్రీలకు పైజామాలు తొడిగించి తొండలు వదిలి పైశాచిక ఆనందం పొందారు. మహబూబ్నగర్ జిల్లాలో బోర్ వెల్లి దళితవాడలో స్త్రీలందరినీ మానభంగం చేయగా వారందరూ ఆత్మహత్య చేసుకున్నారు. మోత్కూర్లో గడ్డంఅమీన్ అకృత్యాలు, సలా ఉద్దీన్ అత్యాచారాలు మొదలైనవి ఆనాటి రజాకార్ల అకృత్యాలకు ఉదాహరణలు. నిజాం లొంగిపోవడంతో ఖాసిం రజ్వీ, రజాకార్లు అరెస్టు చేయబడ్డారు. హైదరాబాద్ భయంకరమైన పరిస్థితి నుంచి విమోచనం కలిగింది. కాబట్టే సెప్టెంబర్ 17న విమోచనంగా భావిస్తారు. మొత్తంగా విమోచనం అనేవారు ముస్లిం రాజునుంచి హిందువులు విమోచనం పొందారని అభిప్రాయంతో ఉండవచ్చు. కానీ ముస్లిం రాజుకు సహకరించిన భూస్వాముల్లో, జమీందారుల్లో 95 శాతం మంది హిందువులు. రజాకార్లను ప్రోత్సహించిన వారిలో హిందు భూస్వాములు కూడా ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటానికి ప్రేరణ షేక్ బందగి రక్త తర్పణం.
నిజాం రాజుకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగరవేసిన ముస్లింలు సైతం ఉన్నారు. నిజాం కాలేజ్ విద్యార్థి నాయకుడు ఆల్ హైద్రాబాద్ స్టూడెన్స్ యూనియన్ సహాయ కార్యదర్శి రఫి అహ్మద్ త్రివర్ణ జెండా పతాకాన్ని ఎగురవేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ ఇమ్రోజ్ పత్రికల్లో వ్యాఖ్యలు రాసినందుకు చేతులు నరికి చంపివేయబడ్డాడు.
ముగ్దుమ్ మోహియుద్దీన్ నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. కాబట్టి ముస్లిం రాజు నుంచి హిందువులు విమోచనం పొందారనే అభిప్రాయంలో వాస్తవం ఎంత?. నిజాం కాలంలో భూస్వాములు, జాగీర్దార్లు, దేశముఖ్లు వారి తాబేదార్లు నిజాం దోపిడీకి మూలస్తంభాలు. 40 వేల ఎకరాల భూస్వామి విసునూరు రామచంద్రా రెడ్డి, ఆయన కొడుకు బాబు దొర, ఆయన తల్లి జానకమ్మ ప్రజా కంఠకులు. వీరిని వ్యతిరేకించినందువల్లే తొలి రక్తప్రేరణ బందగి రక్తతర్పణ జరిగింది. విసునూరు గడిపై పోరాటం ప్రారంభించింది చాకలి ఐలమ్మ. మునగాల పోరాటం, పరిటాల ప్రజాఉద్యమం, తిమ్మాపూర్, అల్లిపూర్లో తిరుగుబాట్లు, ముల్కలగూడెం తిరుగుబాటు, గాంధీ దృష్టికి వెళ్లిన ఆకునూరు, మాచిరెడ్డి పల్లి దుర్ఘటనలు, ఆజాంగోరి ఆగడాలు, నార్లపురం ముక్తేదార్ దౌర్జన్యం, పింగళిప్రతాప్ రెడ్డి, మల్లపురం జమీందారు దురాగతాలు మొత్తంగా తెలంగాణలో నిజాం నవాబు చేతి కింద ఉన్న దొరలు, భూస్వాముల అకృత్యాలు పెరిగిపోయాయి. వీరికి వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ పోరాటం ద్వారా మూడు వేల గ్రామాల్లో విముక్తి లభించింది. 10 లక్షల భూమి ప్రజలకు పంచబడ్డది. కాబట్టి సాయుధ పోరాట దినంగా పిలవాలి అంటారు. సెప్టెంబర్ 17న విశాలమైన, వైవిధ్య భరితమైన భారతదేశంలో అంతే వైవిధ్యభరితమైన తెలంగాణ సమాజం అంతర్భాగమై గంగా జమున తేహాజీబ్కి నిలయంగా, జాతీయ సమైక్యతకు నిదర్శనంగా తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం నిలచింది.
కాబట్టి జాతీయ సమైక్యత దినంగా జరుపుకోవాలంటారు. రాజరికం అస్తమించి నవాబుల, భూస్వాముల, దేశ్ ముఖుల పాలన అంతమై యావత్ ప్రజానీకం భాగస్వాములైన ప్రజాపాలన ప్రారంభమైంది కాబట్టి ప్రజా పాలనా రోజుగా జరుపుకుందాం అంటారు. విలీనం మనేది వాస్తవం. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. విమోచనం అనేది కూడా వాస్తవం. కానీ ఒక ముస్లిం రాజు పాలనా నుండి హిందువులకు విమోచనం జరిగిందనే అర్థంలో కాకుండా ఒక రాజరికం వ్యవస్థ నుంచి ఈ ప్రాంతానికి విమోచనం జరిగిందని గుర్తించాలి. కులం, మతం భేదాలు పక్కన పెట్టి ఆర్య సమాజం, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల సభ్యులందరూ కలసి సమైక్యతతో పోరాటం సాగించారు కాబట్టే విలీనం, విమోచనం సాధించారు. నిజాం పాలనా అంతమైన, సైనిక పాలన వెల్లోడి సివిల్ సర్వెంట్ పాలన వచ్చిందే కాని ప్రజాపాలన రాలేదనేవారు కూడా ఉన్నారు. రాజరికం అంతమై ప్రజాపాలనాకు సైనిక, సివిల్ సర్వెంట్ పాలననే పునాదని గుర్తించాలి. మొత్తంగా ఈ రోజును ప్రజాపాలనగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అధికారికంగా జరుపుకోవడం సంతోషం. కానీ ఈ సంబరాన్నైనా విలీన సంబరంగా, అధికారికంగా జరుపుకుంటే ఇంకా సంతోషించే వాళ్ళం.
జె నారాయణ యాదవ్
9494019270