Wednesday, June 18, 2025

సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు విమర్శించారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బిఆర్ఎస్ మాజీ ఎంపిటిసి కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేబితే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.

మొన్న ఎసిబి విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తన మనసు కకావికలమైందన్నారు. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారని, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.

తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అని కెటిఆర్ స్పష్టం చేశారు. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ రోజు కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరిగే అవకాశం ఉందని, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కెటిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News