విద్య, వైద్యం అందించడంలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. ప్రభుత్వ -ప్రైవేటు, ప్రభుత్వ- ప్రభుత్వ, ప్రైవేట్ -ప్రైవేట్ విద్య, వైద్య సంస్థల మధ్య నిర్వహణలో, ఏర్పాట్లలో స్పష్టమైన తేడాలు, అసమానతలున్నాయి. నవోదయ విద్యాలయాలు, ఎస్సి, ఎస్టి గురుకుల విద్యాలయాలు, సైనిక పాఠశాలలు, రైల్వే పాఠశాలలు, సింగరేణి పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ప్రభుత్వ పబ్లిక్ స్కూల్స్, కస్తూరీభా బాలికల స్కూల్స్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సక్సెస్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, క్రైస్తవ మిషనరీ స్కూల్స్, ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలు, ప్రైవేట్, కార్పొరేట్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నిర్మాణంలో, నిర్వహణలో నెలకొన్న అసమానతలకు ప్రత్యక్ష ఉదాహరణలు. నవోదయ పాఠశాలల పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం జిల్లా పరిషత్ పాఠశాలలపై లేదు. నిర్మాణంతోపాటు, నిర్వాహణాపరమైన లోపాలే దీనికి ప్రధాన కారణం.
ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్య-, వైద్య సంస్థల నిర్మాణం, నిర్వహణలో వ్యత్యాసం తీవ్ర స్థాయిలో ఉంది. విద్య, వైద్య రంగాలలో ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాట. వీళ్ళకు ప్రజాస్వామిక విలువలు, మానవత విలువలు ఏమీ పట్టవు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించరు. విద్య, -వైద్యాన్ని సేవలుగా కాకుండా వ్యాపారంగా నిర్వహించడమే వీరి ప్రధాన లక్ష్యం. విద్య, -వైద్యాన్ని కొనడం, -అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు గడించి విద్య, వైద్య వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రాంతాలుగా విస్తరించడమే వీరి ప్రధాన ఆశయం. వీరి దృష్టిలో మనీ సంబంధాలే తప్ప మానవ సంబంధాలు ఉండవు. సేవా ముసుగులో ప్రైవేట్- కార్పొరేట్ శక్తులు కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీకి అంతు లేదు. ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తూ తమ దోపిడీ మార్గాలను విస్తరించుకుంటూ పదిలపరుచుకుంటున్నారు.
ప్రైవేట్ -కార్పొరేట్ విద్య-,(Private -Corporate Education) వైద్య సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులకు, వైద్యులకు, ఇతర సిబ్బందికి జీతభత్యాలు ప్రభుత్వ సిబ్బందితో పోల్చుకుంటే చాలా తక్కువ. ప్రైవేట్, కార్పొరేట్ విద్య-, వైద్య సంస్థల యాజమాన్యాలు ప్రజలనుండి ఆర్థిక దోపిడీ, సిబ్బంది నుండి శ్రమదోపిడీ నిరాటంకంగా కొనసాగిస్తూ అక్రమ లాభాలను తిరిగి పెట్టుబడిగా పెడుతూ హైటెక్ ప్రచారంతో బహుళ అంతస్థులతో ప్రజలను మురిపిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్య-, వైద్య సంస్థల్లో అందరూ అనుకుంటున్నట్లు అంతా బాగుందనేది కూడా ఒక భ్రమ మాత్రమే. ప్రైవేట్-, కార్పొరేట్ యాజమాన్యాలు పిఆర్ఒ (దళారులు)లను నియమించుకొని అన్ని గ్రామాలలో తిప్పుతూ విద్యలో రాణిస్తున్న మెరికల్లాంటి విద్యార్థుల జాబితాను సేకరించి డబ్బు, ఉచిత చదువు, భోజనం, వసతి వంటి ప్రలోభాలకు గురిచేస్తూ తమ విద్యా సంస్థలో చేర్చుకుంటున్నారు. ఆ విద్యార్థులు సాధించిన విజయాలను తమ విద్యా సంస్థ సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నారు.
తల్లి దండ్రులను, విద్యార్థులను, ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారు. అప్పటి వరకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా శ్రమపడిన ప్రభుత్వ విద్యా సంస్థలను, అక్కడి ఉపాధ్యాయులను అవహేళనకు గురి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మొదటి, ద్వితీయ శ్రేణి విద్యార్థులను ప్రైవేట్ -కార్పొరేట్ యాజమాన్యాలు కొనుగోలు చేయగా, తృతీయ శ్రేణి విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుతున్నారు. తృతీయ శ్రేణి విద్యార్థుల ఫలితాలే వాస్తవ ఫలితాలుగా భావించే ప్రజలు ప్రభుత్వ విద్యా సంస్థలపట్ల పెదవి విరుస్తున్నారు. ఎస్ఎస్సి, ఇంటర్లో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో విజయాలు సాధించిన విద్యార్థుల పూర్వచదువు వివరాలను సేకరిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయి. ప్రైవేట్, -కార్పొరేట్ యాజమాన్యాల జిమ్మిక్కులు బట్టబయలవుతాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల శ్రమవిజయాలు కార్పొరేట్ యాజమాన్యాల వశమవుతున్నాయి.
ఈ కారణంచేత నిరంతరం అంకిత భావంతో కష్టపడి పని చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి, పట్టుదల కుదేలవుతున్నది. ఈ మొత్తం తతంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, -విద్యా సంస్థలు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ప్రజలకు దూరమవుతున్న సందర్భం కనపడుతున్నది. విద్య-, వైద్య రంగాలో విచ్చలవిడిగా ప్రైవేట్-, కార్పొరేట్ యాజమాన్యాలు వచ్చి చేరిన తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకున్నది. ప్రాథమిక దశ నుండి సాధారణ విద్యార్థులను మెరిట్ విద్యార్థులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఉపాధ్యాయుల వంతు కాగా, మెరిట్ విద్యార్థులను ఆశలు ఎర చూపి తమ విద్యాసంస్థల్లో చేర్చుకొని, వారి ద్వారా వచ్చిన విజయాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం ప్రైవేట్, -కార్పొరేట్ యాజమాన్యాల వంతుగా మారింది. ఈ తంతు 1990 దశకం నుండి ప్రారంభమైంది. కార్పొరేట్ విద్య, వైద్య సంస్థల అధిపతులు ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వ పెద్దలుగా మారడం దుష్పరిణామం.
చాలా వరకు ప్రైవేట్-, కార్పొరేట్ సంస్థలు సరైన అనుభవం గాని, అర్హతలు గాని లేని వారితో నిర్వహిస్తున్నారు. అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వానికి రికార్డులు నివేదిస్తారు. వాస్తవానికి చాలా ప్రైవేట్ -కార్పొరేట్ విద్య, వైద్య సంస్థల్లో సరైన మౌళిక వసతులు లేవనేది యదార్ధం. ఇదే సందర్భంలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతలు విస్మరిస్తున్నారనేది వాస్తవం. నవోదయ విద్యాలయాల్లో చేర్పించడానికి పోటీపడుతున్న తల్లిదండ్రులు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించడానికి ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం. ఈ రెండు విద్యాసంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. కాని ఒకే విధంగా నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులు తప్ప మిగతా అన్నింటిలో తీవ్రమైన వ్యత్యాసం వుంది. సొసైటీల రూపంలో విద్య, వైద్య రంగాలలోకి ప్రైవేట్-, కార్పొరేట్ శక్తులు ప్రవేశించాయి.
సొసైటీలను అడ్డం పెట్టుకొని అనేక రాయితీలు, మినహాయింపులు ప్రభుత్వం నుండి పొందుతున్నారు. విచ్చలవిడిగా, పెద్ద మొత్తంలో విద్యార్థుల నుండి అనేక రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల రూపంలో నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఉండదు. ఫీజుల నిర్ణయం, వసూలులో ప్రైవేట్, -కార్పొరెట్ యాజమాన్యాలదే అంతిమ నిర్ణయం. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించిన దాఖలాలు లేవు. నేడు సమాజంలో పేద, అతి పేద, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక, అతి ధనిక వర్గాలుగా ప్రజలు విడిపోయి ఉన్నారు. వారివారి ఆర్థిక- సామాజిక స్థితిగతులను బట్టి విద్య, -వైద్య సదుపాయాలు అందుతున్నాయి. అందరికీ మెరుగైన, నాణ్యమైన, ఒకే విధమైన విద్య, -వైద్య సదుపాయాలు మాత్రం అందడం లేదు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
- విశ్వ జంపాల, 77939 68907