తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టిటిడి ఒక పరిశీలనాత్మక గరుడ సేవను నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ గరుడ సేవలో వీలైనంత ఎక్కువ మంది భక్తులు వాహన సేవను తిలకించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు రంగశ్రీ, దివాకర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ- నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ కృష్ణస్వామివారిని శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అర్చకులు అభిషేకించారు.