భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర అనేక సాంకేతిక సమస్యల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లోపాలన్నిటినీ సరిచేయడంతో తాజాగా భారత అంతరక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూన్ 19న ఈ యాత్రకు బయలుదేరనున్నట్టు ప్రకటించింది. మొదట జూన్ 11న రాకెట్ను ప్రయోగించడానికి రంగం సిద్దమైంది. కానీ రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీకవుతుందని తెలిసినా పట్టించుకోకుండా అలాగే రాకెట్ను ప్రయోగించడానికి స్పేస్ఎక్స్ టీమ్ నిర్ణయించింది. కానీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అత్యంత శ్రధ్ధతో నిపుణులను అప్రమత్తం చేయడంతో ప్రయోగం ఆగిపోయి మరమ్మతులు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈనెల 11న ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్ట్ను తనిఖీ చేస్తుండగా రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీకవుతుందని గుర్తించారు.
ఇది గుర్తించకపోతే లిక్విడ్ ఆక్సిజన్ భారీగా మండుతుండడంతో రాకెట్ ప్రయోగం భారీ వైఫల్యానికి గురై ఉండేదని నిపుణులు వెల్లడించారు.బూస్టర్ ప్రవేశంలో ముందుగానే తాము లిక్విడ్ ఆక్సిజన్ లీకవుతుండడాన్ని గమనించినా, ఫాల్కన్ 9 పునర్నిర్మాణం సమయంలో పూర్తిగా మరమ్మతు కాలేదని గుర్తించామని తెలిపారు. “మేం ఇప్పుడు లాంచ్ ప్యాడ్ పైకి వెళ్లాం. తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాం. ” అని స్పేస్ ఎక్స్కు చెందిన బిల్డు అండ్ ఫ్లైట్ రిలియబిలిటీ వైస్ ప్రెసిడెంట్ విలియం జెర్స్టెన్మెయిర్ తెలిపారు. ఈ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తాం. మళ్లీ ఇది సంపూర్ణ ఆకృతిని పొందుతుంది. ఒక ప్రక్షాళన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఆక్సిజన్ లీకైనా సమస్య ఉండదు. అందువల్ల గగనయానానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ” అని జెర్స్టెన్మెయిర్ వివరించారు. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్న సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ప్రకటించింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్ ’ ఈ మిషన్ను నిర్వహిస్తోంది.
ఇందులో ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ,ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ కాప్సూల్ను ఫాల్కన్9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ వ్యోమనౌక భూమినుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత , అంతర్జాతీయ అంతరక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోడీ , పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.