రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు చేస్తున్న ఉచిత ప్రమాద బీమా పథకం కింద ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఒక కార్మికుని కుటుంబానికి రూ.1.20 కోట్ల బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అందచేశారు. శనివారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ చెక్కును మృతి చెందిన రామగుండం- 1 ఏరియాకు చెందిన స్పోర్టు మెన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య శ్రీలతకు అందచేశారు. సింగ్రేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాల్రీ ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపధ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య శ్రీలత రూ.1.2 లక్షల ప్రమాద బీమా కింద చెల్లించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అమలు చేస్తున్న రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకం ప్రభుత్వ రంగ సంస్థలకే గాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందన్నారు. అనుకోని ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లయితే వారి కుటుంబం వీధిన పడకుండా ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. మృతుని కుటుంబానికి త్వరలో కారుణ్య నియామక పత్రాలు అందచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, రెడ్కో వైస్ ఛైర్మన్, ఎండీ అనీలా, ఎస్బీఐ డీజీఎం నీలాక్షి సింగ్, రీజనల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్ డి ఎం సుభాని పాల్గొన్నారు.