కొలంబో: మహిళల ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన ఈ ఫైనల్ పోరులో 92 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్ రికార్డు(New Record) సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటింగ్లో మందన 116, హర్లిన్ 47, జెమిమా 44, హర్మన్ప్రీత్ 41 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్తో 102 వన్డేలు పూర్తి చేసుకున్న మంధన(Smriti Mandhana) తన కెరీర్లో 11వ శతకాన్ని సాధించింది. దీంతో ఆసీస్ క్రీడాకారిని మెగ్ లాన్నింగ్(15), సుజీ బేట్స్(13) తర్వాత అత్యధిక శతకాలు సాధించిన క్రీడాకారిణిగా స్మృతి నిలిచింది. అంతేకాక.. ఈ మ్యాచ్లో మరో రికార్డును(New Record) కూడా తన సొంతం చేసుకుంది. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్ పేరిట ఉన్న రికార్డును స్మృతి బద్దలు కొట్టింది. హర్మన్ ఈ మ్యాచ్తో కలిసి 53 సిక్సులు కొట్టగా.. స్మృతి 54 సిక్సులతో కెప్టెన్ హర్మన్ను దాటేసింది.