ముగ్గురు స్నేహితులు కలిసి నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, సోమశిలలోని కృష్ణానదిలో స్నానానికి దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. వారాంతపు సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి భరత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆదివారం ఉదయం కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. అపస్మార స్థితికి చేరుకున్న అతనిని మిగిలిన ఇద్దరు స్నేహితులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును వీరు ప్రయాణిస్తున్న కారుతో ఢీకొట్టారు. దీంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందినవారు. భరత్ మృతితో స్నేహితులు, కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో బాధితుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు.