కని పెంచిన తల్లిని ఓ కసాయి కొడుకు నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా, సంగెం మండలంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలు, ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని వినోద, సాంబయ్యలకు కుమార్తె స్వరూప, కుమారుడు సతీష్ ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. సాంబయ్యకు ఉన్న మూడు ఎకరాల భూమిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అప్పగించారు. అందులో వచ్చిన డబ్బులను కొడుకుకు ఇచ్చి రూ. ఆరు లక్షలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. వాటికి వచ్చే వడ్డీ కూడా తనకు ఇవ్వాలని కొడుకు గత కొద్దిరోజులగా ఇంట్లో గొడవ చేస్తున్నాడు. అయితే, టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన లబ్ధిదారుడైన ముత్తినేని సతీష్ సాంబయ్య పేరుపై ప్లాటు వచ్చింది. అలాగే 20 గుంటల పొలం ఉంది. తన కుమారుడికి డబ్బులు ఇస్తే వృథాగా ఖర్చు చేస్తాడని అనుకున్న తల్లిదండ్రులు వారి వద్దనే ఉంచుకున్నారు.
తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులు వాటి వడ్డీని తన అక్కకు ఇస్తున్నావని, కానీ ఇవ్వడం లేదని తరుచూ ఇంట్లో గొడవ పెట్టేవాడు. దీంతో గ్రామంలో, పోలీస్స్టేషన్లో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా సతీష్ మారకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలోనే వేరే ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. కొడుడు వేధింపులు తట్టుకోలేక తల్లి వినోద గతంలో కెనాల్లో పడి చనిపోడానికి వెళ్లగా కొంతమంది అడ్డుకొని ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి ఆమె కాళ్లపై కొడుకు తీవ్రంగా కొట్టాడు. ఎప్పటికైనా తల్లిదండ్రులను చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇంటి నుంచి వెళ్లి గంగదేవిపల్లిలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున కుంటపల్లిలో తన ఇంట్లో నిద్రిస్తున్న తల్లిపై సతీష్ కోపంతో ప్లాస్టిక్ బాటిట్లో తెచ్చుకున్న పెట్రోల్ చల్లి, నిప్పంటించగా కేకలు వేసింది. తండ్రి లేచి తన కొడుకును ఆపే ప్రయత్నం చేయగా నెట్టివేసి అగ్గిపెట్టె గీసి ఆమెపై వేసి ‘నువ్వు చస్తేనే భూమి, పైసలు వస్తాయి’ అని అరుచుకుంటూ గోడ దూకి పరారయ్యాడు.
మంటల్లో కాలిపోతూ అరుస్తూ ఇంటి బయట తిరుగుతున్న ఉన్న భార్యను భర్తతోపాటు చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి 108లో ఎంజిఎంకు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వినోద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. తన కుమారుడు సతీష్ పెట్రోలు పోసి నిప్పంటించాడని వాపోయింది. క్షతగాత్రురాలిని సిఐ రాజగోపాల్, ఎస్ఐ నరేశ్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.