న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆదివారం(జూన్ 15) రాత్రి 10 గంటల తర్వాత స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కడుపు సంబంధిత సమస్య కారణంగా సోనియా గాంధీ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేరారని.. ప్రస్తుతం ఆమె పరిశీలనలో ఉన్నారని సర్ గంగా రామ్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనియా ఆస్పత్రిలో చేరడంతో పార్టీ సభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
కాగా, జూన్ 7న, ఆమెను సాధారణ వైద్య పరీక్షల కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె వైద్య పరీక్షల తర్వాత సోనియా డిశ్చార్జ్ చేశారు. గత ఫిబ్రవరిలోనూ ఆమె సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.