భారత్-పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను(IPL) తాత్కాలికంగా రద్దు చేసిన బిసిసిఐ తిరిగి 17వ తేదీ నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ ప్రారంభం కోసం సిద్ధంగా ఉండాలని అన్ని ఫ్రాంచైజీలకు బిసిసిఐ(BCCI) సూచించింది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవడంలో ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలకు సౌతాఫ్రికా(South Africa) క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది.
జూన్ 11న లార్డ్స్ వేదికగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో తలపడనుంది. దీంతో ఈ మెగా టెస్ట్ మ్యాచ్లో పాల్గొనాల్సిన సఫారీ ఆటగాళ్లు ఐపిఎల్కి(IPL) దూరం కానున్నారు. దీంతో సౌతాఫ్రికా ఆటగాళ్లను ముందు అనుకున్న విధంగా మే 26నే స్వదేశానికి పంపించాలని సఫారీ క్రికెట్ బోర్డు బిసిసిఐని(BCCI) కోరుతోంది.
తమ మొదటి ప్రాధాన్యత డబ్ల్యూటిసి ఫైనలే అని.. టెస్ట్ జట్టులో భాగమయ్యే తమ ఆటగాళ్లను మే 26న కచ్చితంగా తిరిగి పంపించాలని అనుకుంటున్నట్లు, బిసిసిఐని కూడా అదే కోరుతున్నామని.. సౌతాఫ్రికా(South Africa) క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఈనాక్ నిక్వే తెలిపారు. దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ కూడా బోర్డు నిర్ణయంతోనే ఏకీభవించారు. ‘మే 26న ఆటగాళ్లు దక్షిణాఫ్రకాకు వస్తే.. మే 30వ తేదీన మేం డబ్ల్యూటిసి ఫైనల్స్కి బయలుదేరాల్సి ఉంటుంది. దీనిపై వెనక్కి తగ్గడం లేదు’ అని షుక్రి అన్నారు.