Sunday, September 14, 2025

తెలంగాణను ప్రముఖ వెడ్డింగ్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

పెళ్లి వేడుకలు జరిపించేందుకు ప్రపంచంలో ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణను చూపించడమే ధ్యేయంగాప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దానిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా చూస్తోందని, అలాంటి సమయంలో తెలంగాణను ప్రపంచ పటంలో వివాహ వేడుకల హబ్‌గా నిలపాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నాల్గవ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్‌లో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ థీమ్స్, బడ్జెట్లకు అనుగుణంగా పెళ్లిళ్లను జరిపేందుకు అద్భుతమైన వేదికగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు.

పురాతన కోటలు, రాజమహాళ్లు, దట్టమైన అడవులు, నదులు సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హోటళ్లు – తెలంగాణలోని ఈ సంపద ప్రపంచ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. వెడ్డింగ్ ప్లానర్లు తెలంగాణను కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా, ఒక జీవించే సంస్కృతిగా కొత్త దృష్టితో చూసి, దీనిని భారతదేశంలోనే కాక, అంతర్జాతీయంగా పరిచయం చేయాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాలు, రెండు సంస్కృతుల మిళితమని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో పెళ్లి వేడుకలు పూర్తి చేసుకోవాలని, మధుర స్మృతులను పదిలపరచుకోవాలని కాబోయే వధూవరులకు ఆయన సూచించారు.

అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికల రూపకల్పన
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల గురించి వివరాలను ప్రచారంలోకి తీసుకువచ్చి వివాహ వేడుకలను ఎందుకు తెలంగాణలో చేసుకోవాలో తెలిపేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్లను పరిశ్రమకు ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేస్తామని అన్నారు. లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్ , వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామని చెబుతూ “మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం‘ అనే నినాదంతో పర్యాటక శాఖ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

మీరు దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిరూపించుకున్నారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ వెడ్డింగ్ ఈవెంట్‌గా ఎదిగే సమయం వచ్చిందని అన్నారు. తదుపరి ఎడిషన్‌కు సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ పేరును ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్‌గా మార్చి రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్, గోవా వంటి భారతదేశంలోని వివిధ సంస్కృతులను ఒకే వేదికపై పరిచయం చేయాలని నిర్వహకులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, తదితరులు పాల్గొన్నారు.

Also REad:  హీరోయిన్ ఊర్వశి రౌటేలాకు ఇడి నోటీసులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News