Thursday, June 26, 2025

అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం రోదసిలోకి బయల్దేరారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి ఐఎస్‌ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ను చేపట్టింది.

భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఇఎస్‌ఎ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. అంతరిక్షంలో ఆయనను ‘శుక్స్’గా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్)చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం (Subhanshu Team) 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం.. 2027లో చేపట్టే స్వీయ మానవసహిత యాత్ర గగన్‌యాన్‌కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది.

ఐఎస్‌ఎస్‌లో శుభాంశు ఇస్రో తరపున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదసిలో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. అంతకు ముందు 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.

ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసియానం చేయడం మళ్లీ ఇప్పుడే. వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు శుభాంశు తనకు ఎంతో ఇష్టమైన పాటను విన్నారు. గతేడాది విడుదలైన ‘ఫైటర్’ సినిమాలోని ‘వందేమాతరం’ అనే పాట శుభాంశు శుక్లాకు చాలా ఇష్టమట. అందుకే, రోదసిలోకి వెళ్లేముందు ఈ పాటనే ఆయన విన్నారు. ‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమానికి శత్రువు కూడా సెల్యూట్ చేస్తాడు’ అంటూ సాగే ఈ పాట దేశభక్తిని రగిలిస్తుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ‘ఫైటర్’ సినిమాలో బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్‌కపూర్ తదితరులు నటించారు. బంకింగ్ చంద్ర ఛటర్జీ రాసిన లిరిక్స్‌ను రీమిక్స్ చేసి రూపొందించిన ‘వందేమాతరం’ పాటను విశాల్ దడ్లానీ పాడారు. సాధారణంగా వ్యోమగాములు రోదసియాత్ర చేపట్టే ముందు వారికి ఇష్టమైన సంగీతం వినడం నాసాలో కొంతకాలంగా వస్తోన్న ఆనవాయితీ.

ఎలాంటి కంగారుపడకుండా మిషన్‌పై దృష్టిపెట్టేందుకు ఇలా మ్యూజిక్ వింటారు. ఒత్తిడిని తగ్గించేందుకు సంగీతం శక్తిమంతమైన సాధనం అని పలు అధ్యయనాల్లోనూ తేలిన సంగతి తెలిసిందే. ‘భారత్ మళ్లీ అంతరిక్షంలోకి వస్తోంది, జై హింద్!’ అంటూ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన చారిత్రక అంతరిక్ష యాత్రకు ముందు ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లనున్న తొలి భారతీయుడిగా, అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.ఈ సందర్భంగా శుక్లా తన భార్య కామ్నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘నా అద్భుతమైన భాగస్వామి కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు.

నువ్వు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అంతకన్నా ముఖ్యంగా దీనికి ఏ విలువా ఉండేది కాదు’ అని ఆయన పేర్కొన్నారు. గాజు గోడకు చెరోవైపు ఉండి వీడ్కోలు చెప్పుకుంటున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. యాక్సియమ్ స్పేస్ సంస్థ, నాసా, స్పేస్‌ఎక్స్‌ల సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో విభిన్న దేశాలకు చెందిన అంతర్జాతీయ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వాణిజ్య, ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ యాత్రలో శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనుండగా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నియెస్కి, హంగేరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా ఈ బృందంలో ఉన్నారు.

  • ఇస్కా రాజేష్ బాబు, 93973 99298
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News